న్యూఢిల్లీ : కొవిడ్-19 గుండె, ఊపిరితిత్తులు సహా కీలక అవయవాలను దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా ఈ వైరస్ కారణంగా మెదడు కుచించుకుపోవడంతో పాటు భావోద్వేగాలు, జ్ఞాపక శక్తిని నియంత్రించే ప్రాంతాల్లో గ్రే మ్యాటర్ తగ్గుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాసనలు నియంత్రించే ప్రాంతాలను దెబ్బతీస్తోందని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. కొవిడ్-19తో ఆస్పత్రుల్లో చేరని వారిలోనూ మహమ్మారి ప్రభావాలు కనిపించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది.
కొవిడ్-19 మెదడుపై చూపే ప్రతికూల ప్రభావాలను సరిచేయవచ్చా, లేక దీర్ఘకాలం అవి కొనసాగుతాయా అనే దానిపై మరింత పరిశోధన అవసరమని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొవిడ్-19 రోగుల్లో మెదడు సంబంధిత అసాధారణ అంశాలకు గట్టి ఆధారాలు లభించాయని అధ్యయనం చేపట్టిన పరిశోధకులు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడిన వారిలోనూ దుష్ప్రభావాలను గుర్తించారు.
అధ్యయనంలో పరిశీలించిన రోగుల్లో సగటున మెదడు 0.2 శాతం నుంచి 2 శాతం వరకూ కుచించుకుపోయిందని నేచర్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న 785 మంది మెదడును రెండు సార్లు స్కాన్ చేసిన మీదట ఈ వివరాలు గుర్తించారు. వీరిలో రెండు స్కాన్ల మధ్య 401 మంది కొవిడ్-19 బారినపడిన వారు ఉన్నారు. తొలి స్కాన్ తీసిన 141 రోజుల తర్వాత రెండవ స్కాన్ తీశారు. బ్రిటన్లో ఆల్ఫా వేరియంట్ ప్రాబల్యం అధికంగా ఉన్న సమయంలో ఈ అధ్యయనం నిర్వహించారు.