Sugar | మనం తీసుకునే ఆహారంలో చక్కెర ఒక భాగమైనదని చెప్పవచ్చు. ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం నిద్రించే వరకు ఏదో ఒక రూపంలో చక్కెరను తీసుకుంటూనే ఉంటాం. టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, కుక్కీస్ ఇలా ఏదో ఒక రూపంలో చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. అయితే చక్కెరను తీసుకోవడం 30 రోజుల పాటు మానేయడం వల్ల మనం అనేక శారీరక, మానసిక మార్పులను గమనించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే చక్కెరను మానేసిన తరువాత మొదట్లో మనం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చక్కెరను తీసుకోవడం మానేసిన తరువాత చిరాకు, అలసట, ఆందోళన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మెదడు చక్కెర అందించే డోపమైన్ హిట్ ను కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. చక్కెర తీసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. శరీరం నెమ్మదిగా చక్కెరకు దూరం అయ్యే కొద్దీ ఈ కోరికలు తగ్గుతూ వస్తాయి.
అయితే డిటాక్స్ ట్రెండ్ కంటే ఎక్కువగా చక్కెరను తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా చక్కెరను తీసుకోవడం తగ్గించడం వల్ల క్రమంగా రెండవ వారం నాటికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గడంతో శరీరం నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. ఇక మూడవ వారం కూడా చక్కెరను తీసుకోవడం మానేయడం వల్ల మనం దీర్ఘకాలిక ప్రయోజనాలనుగమనించవచ్చు. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దద్దుర్లు, మంట, మొటిమలు, పగుళ్లు వంటివి తగ్గుతాయి. అకాల వృద్దాప్యం రాకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర క్రాష్ లు తగ్గడం వల్ల మనం మరింత స్థిరంగా దృష్టి కేంద్రీకరించవచ్చు.
క్యాలరీలు తీసుకోవడం తగ్గడం వల్ల శరీర బరువు తగ్గడాన్ని మనం ఎక్కువగా గమనించవచ్చు. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక చక్కెర ఉండే స్వీట్లు, పానీయాలు, బేక్ చేసిన వస్తువులు తీసుకోవడం తగ్గించడం వల్ల ప్రజలు పండ్లు, గింజలు వంటి వాటిని తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. చక్కెర కలిగిన ఆహార పదార్థాలకు బదులుగా నానబెట్టిన ఖర్జూరాలు, పెరుగు వంటి వాటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అంతేకాకుండా చక్కెరలో వచ్చే హెచ్చుతగ్గులు బద్దకం, చిరాకుకు కారణమవుతాయి. కనుక చక్కెరను మానేయడం వల్ల మనం ఉత్సాహంగా ఉండడంతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇలా నెలరోజుల పాటు చక్కెర తీసుకోవడం మానేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చక్కెర మానేయడం తాత్కాలికంగానే కాకుండా స్థిరమైన జీవనశైలి ఎంపికగాఉండాలని వారు సూచిస్తున్నారు. చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, ఖర్జూరం వంటి వాటిని మితంగా తీసుకోవాలి. అలాగే తీపి వంటకాల తయారీలో చక్కెరకు బదులుగా యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటిని వాడడం వల్ల తీపి తింటున్నామన్న అనుభూతి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.