ఇంట్లో ఎవరికి దగ్గు వచ్చినా వెంటనే మందుల షాపుకెళ్లి, ఏదో ఒక ఔషధం తెస్తాం. తోచిన డోసేజీలో వాడేస్తాం. నిజానికి దగ్గుకు కారణాలు అనేకం. వాటిని లోతుగా పరిశీలించకుండా ఇష్టం వచ్చిన మందులను వాడటం ప్రమాదకరం. మార్కెట్లో లభించే దగ్గు మందుల్లో చాలావరకూ అశాస్త్రీయమైనవే. ఇవి విరుద్ధ గుణాలు కలిగిన అనేక రసాయనాల మిశ్రమం. ఒకే మందులో దగ్గును లోలోపల అణచివేసే ‘కాఫ్ సప్రసెంట్స్’, దగ్గుకు సహకరించి శ్లేష్మాన్ని బయటకు రప్పించే ‘ఎక్సో పెక్టోరెంట్’, శ్లేష్మాన్ని పొడిబారించి చిక్కబరిచే ‘యాంటి యాస్టమిన్’, శ్వాసనాళాల వ్యాకోచానికి అవసరమయ్యే ‘బ్రాంకో డయలేటర్స్’, శ్లేష్మాన్ని కరిగించే ‘మ్యూకోలైటిక్స్’, జ్వరాన్ని తగ్గించే ‘పారాసెటమాల్’ కలగలసి ఉంటాయి. వీటిలో ఒక్కొక్కదానికి ఒక ఉపయోగం ఉన్నా, వాటి పరిమాణం తక్కువగా ఉండటం వల్ల, ఏదీ సరిగ్గా పనిచేయదు. మొత్తంగా, కలగూరగంప వ్యవహారమే.
శ్వాస వ్యవస్థలో వివిధ కారణాల వల్ల పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటకు పంపి, శ్వాసక్రియ సజావుగా సాగడానికి దగ్గు ఉపకరిస్తుంది. మూలాలను నిర్మూలిస్తే, దగ్గు దానంతట అదే తగ్గిపోతుంది. దగ్గు తీవ్రంగా ఉండి.. నిద్రాహారాలు కష్టమైనప్పుడు ‘కాఫ్ సప్రసెంట్స్’ వాడాలి.
పిల్లల్లో దగ్గు ప్రారంభంలో పొడిపొడిగా ఉన్నా 2 నుంచి 5 రోజుల్లో శ్లేష్మం వస్తుంది. నాలుగేండ్ల లోపు పిల్లలు దగ్గి శ్లేష్మాన్ని ఉమ్మివేయలేరు. అది కొద్దికొద్దిగా పేరుకుపోయి వాంతి రూపంలో బయటపడుతుంది. నీటిలో పసుపు వేసి, మరిగించాక వచ్చే ఆవిరిని పట్టడం వల్ల కూడా దగ్గినప్పుడు శ్లేష్మం బయటకు వస్తుంది. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల గొంతునొప్పి త్వరగా తగ్గుతుంది. సాధారణ పరిస్థితుల్లో, ఈ ప్రయత్నాలన్నీ విఫలమైతే వైద్యులను సంప్రదించవచ్చు.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు