మీరు ఆఫీసులో ఒకేచోట ఎనిమిదిగంటలు కూర్చొని పనిచేస్తున్నారా? శారీరక శ్రమ చేయట్లేదా? అయితే, మీకు గుండెపోటు ముప్పు ఎక్కువేనంటోంది తాజా అధ్యయనం. రోజులో 8 గంటలకు పైగా ఆఫీసులో కూర్చోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 50శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనంలో తేలింది. గుండెపోటు, స్ట్రోక్లతో సహా కార్డియోవాస్కులర్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు గుర్తించారు.
చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించింది. 21 దేశాల్లో 1,05,677 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. 11 ఏళ్లపాటు అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ముగిసే సమయానికి, 6,200 మరణాలు నమోదయ్యాయి. ఇందులో 2,300 గుండెపోటు కేసులు, 3,000 స్ట్రోక్స్ కేసులతోపాటు మరో 700 కేసులున్నాయి. అయితే, ఇందులో చాలావరకు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు లేరు. ఈ అధ్యయనం ప్రకారం.. ఒకే స్థలంలో కూర్చుని రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు పనిచేసే వ్యక్తులు గుండెపోటు లేదా స్ట్రోక్కు గురయ్యే అవకాశం 20 శాతం ఎక్కువ. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం దాదాపు 50 శాతం పెరుగుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 17 శాతం ఉండగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయని వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 50 శాతం ఉందని అధ్యయనంలో తేలింది. ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల 8.8 శాతం మరణాలు, 5.8 శాతం గుండె జబ్బులు సంభవించాయని పరిశోధనకు నేతృత్వం వహించిన వీ లీ తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పనిలో తరచూ విరామం తీసుకోవడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని చెప్పారు. శారీరక శ్రమ పెంచడంతోపాటు ధూమపానాన్ని వదిలేస్తే మంచి ఫలితాలుంటాయని సూచించారు.