న్యూ ఢిల్లీ: ప్రాణాంతక కణాల అనియంత్రిత పెరుగుదల వల్ల కణితులు ఏర్పడి, క్యాన్సర్కు కారణమవుతాయి. ఈ కణితులను సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స అందించలేకపోవడంతో ప్రాణాంతకంగా మారుతాయి. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా లేదా జీవనశైలిలో మార్పు వల్ల వస్తుంది. మొదటి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్కు అడ్డుకట్టవేయవచ్చు. జీవనశైలిలో మార్పుల వల్ల క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవచ్చు. అలాగే, క్రమంతప్పకుండా వైద్యుడిని సంప్రదిస్తూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఇదిలా ఉండగా నిత్యం మూడు పనులు చేస్తే క్యాన్సర్ బారినపడకుండా ఉండొచ్చని డబ్ల్యూహెచ్వో సూచించింది.
1.ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
క్యాన్సర్ బారినపడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. తగినంత శారీరక శ్రమ ఉంటే పెద్దపేగు, మూత్రపిండాలు, జీర్ణాశయ, రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు 33శాతం తగ్గుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది. ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. వారంలో కనీసం మూడు రోజులైనా శారీరక శ్రమ ఉండాలి.
2. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు..
ప్రతిరోజూ ఉదయంపూట శరీరానికి సూర్యరశ్మి తాకితే మన శరీరంలో విటమిన్ డీ ఉత్పత్తి అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ఇదిలా ఉండగా, ఎండలో ఎక్కువసేపు ఉంటే అతినీలాలోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, నల్లటి మచ్చలు, ముందస్తుగా వృద్ధాప్యం వచ్చే అవకాశముంది. అందుకే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శరీరంపై ఎండ పడకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి..
పీచు, విటమిన్ ఏ, సీ, ఈ, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన ఆహారంతోపాటు పండ్లు, కూరగాయలు తినాలి. ప్రాసెస్డ్, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దు. అధిక చక్కెర, అధిక కొవ్వు కలిగిన ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన రెడ్మీట్ తినకూడదు. వీటిని తీసుకుంటే మూత్రాశయ, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు అలవాట్లతోపాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. వీటివ్ల నోటి, కాలేయం, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.