ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే వీలుంటుంది. అదేవిధంగా జీవిత కాలాన్ని కూడా పెంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. కొన్ని రకాల ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని పురుషుల్లో 13 ఏండ్ల వరకు.. మహిళల్లో 10 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చునంటున్నారు.
పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక మహిళ తన 20 ఏండ్ల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. తన జీవిత కాలాన్ని 10 సంవత్సరాలు పెంచుకోవచ్చు. అలాగే ఒక పురుషుడు తన జీవితానికి 13 సంవత్సరాలు జోడించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవిత కాలాన్ని కూడా పొడిగిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడించారు. నిత్యం తీసుకునే ఆహారంలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే 80 ఏండ్ల వృద్ధుడు కూడా ప్రయోజనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ వయస్సులో ఆహారంలో మార్పుతో వృద్ధులు తమ జీవిత కాలాన్ని 3.5 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చునని వారు సెలవిస్తున్నారు.
సమతుల ఆహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని, అకాల మరణం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘాయువు కోసం అత్యంత ప్రయోజనకరమైన ఆహారాలైన చిక్కుళ్ళు.. ముఖ్యంగా బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు తీసుకోవాలి. తృణధాన్యాలే కాకుండా వాల్ నట్స్, బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకులు, ధాన్యపు ఆహారాలు మనల్ని ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడతాయని తమ అధ్యయనంలో పేర్కొన్నారు.
దీర్ఘాయువులో ఆహారం పాత్రపై నార్వేకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని కోసం ఒక నమూనాను తయారు చేసి.. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం ద్వారా పురుషులు లేదా స్త్రీలు దీర్ఘాయువుతో ఎలా సంబంధం కలిగి ఉన్నారో పరిశీలించారు. అలాగే, సమతుల ఆహారం తీసుకున్న వారిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తాయో గుర్తించారు. మన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు నిత్యం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకునేలా ప్లేట్ను సిద్ధం చేసుకోవాలి.