శరీరంలో ట్యూమర్ ఏర్పడితే దాని తాలూకు కణాలు చాలా త్వరగా రక్తంలో చేరిపోతాయి. చకచకా శరీరమంతా విస్తరిస్తాయి. దీంతో రోగం ముదిరి ప్రాణాలమీదికి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కనిపిస్తున్నదే.. కొత్తరకం ప్రొటీన్ టీఆర్పీఎం7. ఈ స్పెషలైజ్డ్ ప్రొటీన్, ట్యూమర్ కణాలు రక్తంలో కలువకుండా నివారిస్తుంది. దాంతో అవి శరీరంలోని వివిధ భాగాలకు చేరుకోలేవు. దీనికి సంబంధించిన వ్యాసం ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురితమైంది. ఈ అధ్యయనం మొత్తం.. క్యాన్సర్ కణాలు ప్రైమరీ ట్యూమర్ నుంచి వేరుపడి రక్తంలో కలువడం, తద్వారా మిగతా శరీర
భాగాల్లోకి చేరిపోయి అక్కడ కాలనీలు ఏర్పాటు చేయడం మీదే జరిగింది. ఈ ప్రక్రియను ‘మెటాస్టాసిస్’ అంటారు.
“టీఆర్పీఎం7 అనే ప్రొటీన్ రక్త ప్రసరణలోని ఒత్తిడిని గుర్తించి, వెంటనే ట్యూమర్ కణాలను అక్కడికక్కడ ఆపేస్తుందని మా అధ్యయనంలో తేలింది. దాంతో అవి మిగతా భాగాలకు చేరవు. అలాగే ఈ ప్రొటీన్.. కణాల్లోని క్యాల్షియం స్థాయులను నియంత్రిస్తుంది” అని చెప్పారు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు కౌస్తవ్ బేరా.