Parenting Tips | నాకు సాధారణ ప్రసవం జరిగింది. రోజుల పసికందు అయిన మా బాబుకు కామెర్లు అని చెప్పారు. కానీ వైద్యులు ఎలాంటి చికిత్సా ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఆహారం విషయంలో నేను పత్యం పాటించాలా?
– ఓ పాఠకురాలు
పసికందులకు కామెర్లు సర్వసాధారణం. దాదాపుగా ప్రతి బిడ్డకూ ఈ సమస్య వస్తుంది. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నారులకు జాండిస్ ఎందుకొస్తుంది అంటే.. తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు ఎక్కువ రక్తకణాలు అవసరం అవుతాయి. పుట్టాక వాటి అవసరం ఉండదు. ఆ కణాలు శిథిలం కావడం వల్ల వచ్చే ద్రవ పదార్థం ఇది. కాబట్టి, ప్రత్యేకించి ఏ చికిత్సా అవసరం లేదు. కాకపోతే, జాండిస్ మరీ ఎక్కువగా ఉంటే.. ఫొటోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. బిడ్డ చక్కగా పాలు తీసుకుంటున్నదీ లేనిదీ గమనిస్తూ ఉండాలి.
వయసుతోపాటు బరువు పెరిగే బిడ్డల విషయంలో భయాలే అవసరం లేదు. ఇక తల్లి ఆహారానికి ఎలాంటి పరిమితులూ లేవు. సమతుల పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. రోజుకు రెండు మూడు లీటర్ల ద్రవ పదార్థం తప్పనిసరి. అది గంజికావచ్చు, నీళ్లు కావచ్చు. తల్లిపాలు తాగే బిడ్డలను జాండిస్ ఏమాత్రం ప్రభావితం చేయలేదు. నెలలు నిండకుండా పుట్టినవారు, బరువు తక్కువగా ఉన్నవారు, మధుమేహం ఉన్న తల్లులకు జన్మించిన బిడ్డలకు కామెర్లు వచ్చే ఆస్కారం ఎక్కువ. మూత్ర, మలవిసర్జన సరిగా జరగకపోయినా.. మలం నలుపు నుంచి క్రమంగా పసుపుపచ్చగా మారకపోయినా వెంటనే డాక్టర్కు చూపించాలి. ఏ బిడ్డకైనా ప్రసవం తర్వాత కొద్దిరోజుల పాటు వైద్య సంరక్షణ తప్పనిసరి. కొన్ని రుగ్మతల్ని వైద్యులు మాత్రమే గుర్తించగలరు. జాండిస్ తీవ్రత పెరిగితే మాత్రం బిడ్డకు రక్తమార్పిడి తప్పనిసరి కావచ్చు.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్