గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్.. ప్రపంచాన్ని, మహిళా ప్రపంచాన్నీ పీడిస్తున్న క్యాన్సర్లలో నాలుగో స్థానంలో ఉంది. తొలిదశలోనే చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. మహిళల మరణాల విషయంలో నాలుగో ముద్దాయి ఈ వ్యాధి. ఇటీవలే మనం, ‘సెరావాక్’ పేరుతో దేశీయ టీకాను రూపొందించుకోవడం ఓ ఆశావహ పరిణామం. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దీనిని ఉత్పత్తి చేయనున్నది. జనవరి నెలను ‘సర్వికల్ క్యాన్సర్ నివారణ’ మాసంగా పాటిస్తారు. ఈ నేపథ్యంలో ఓ అవగాహన వ్యాసం..
శరీరంలో కణాలు అసాధారణంగా పెరిగిపోయి, ఇతర ప్రాంతాలకు వ్యాపించడమే క్యాన్సర్. గర్భాశయ ముఖద్వారం దగ్గర కణాల అసాధారణ పెరుగుదలే సర్వికల్ క్యాన్సర్. ఇక్కడినుంచి ఈ కణాలు ఇతర ప్రాంతాలకూ వ్యాపిస్తాయి. మొదట్లో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉంటాయి. కొన్నిసార్లు ఆ కొద్దిపాటి లక్షణాలు కూడా బయటపడకపోవచ్చు. అప్పుడప్పుడూ ఇన్ఫెక్షన్, మూత్రంలో దుర్వాసన తదితర అస్పష్టమైన లక్షణాలను గమనించవచ్చు. తరచూ వెన్నునొప్పి ఉంటుంది. లైంగిక కలయికకు ముందు లేదా తర్వాత రక్తస్రావం జరుగుతుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇందులోనూ హెచ్పీవీ-16, 18 వేరియెంట్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 90 శాతం కారణం అవుతాయి.
హెచ్పీవీ ఇన్ఫెక్షన్కు గురైన మహిళలలో సహజంగా ఉండే వ్యాధి నిరోధకత కారణంగా క్యాన్సర్ లక్షణాలు వాటంతట అవే దూరమైపోయిన సందర్భాలూ ఉన్నాయి. ధూమపాన వ్యసనం, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, గర్భనిరోధక మాత్రలు యథేచ్చగా వాడటం, యుక్త వయసుకు ముందే లైంగిక సంబంధాలు, విశృంఖల శృంగారం.. మొదలైనవి సర్వికల్ క్యాన్సర్కు ఇతర కారణాలు. గర్భాశయాన్ని స్క్రీనింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ, ఉంటే ఎంత మేరకు విస్తరించిందీ గుర్తిస్తారు. క్యాన్సర్కు ముందస్తు దశ ఎక్కువ కాలంపాటు ఉంటే.. సర్వికల్ క్యాన్సర్ వల్ల తీవ్ర అనారోగ్యం నెలకొంటుంది. చివరికి మరణమూ సంభవిస్తుంది. తొలిదశలోనే వ్యాధి నిర్ధారణ జరిగితే పరిస్థితి విషమించకుండా అడ్డుకోవచ్చు.
ఆందోళనకరం
భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ ఈ క్యాన్సర్తో మరణిస్తున్నది. 2020 నాటి గ్లోబోకాన్ నివేదిక ప్రకారం.. భారత్లో క్యాన్సర్ మరణాలలో సర్వికల్ క్యాన్సర్ వాటా 18.3 శాతం. మహిళలకు వచ్చే క్యాన్సర్లలో దీని భాగం 6.29 శాతం. ప్రతి లక్ష మందిలో 18 మంది ఈ మహమ్మారి సోకుతుంది. గత ఐదేండ్లలో అన్ని వయసులవారిని లెక్కలోకి తీసుకుంటే లక్ష మందిలో 422.82 మంది సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాదాపు అరవై శాతం సందర్భాలలో క్యాన్సర్ను చివరి దశలో గుర్తిస్తున్నారు.
క్యాన్సర్ నిర్ధారణ
సర్వికల్ క్యాన్సర్ను పాప్ స్మియర్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. దీనికోసం గర్భాశయం నుంచి కణజాలాన్ని తీసుకుంటారు. అయితే, ఈ పరీక్షలో పొరపాట్లకు ఆస్కారం లేకపోలేదు. కొన్నిసార్లు తప్పుడు ‘పాజిటివ్’లు వచ్చే ప్రమాదం ఉంది. బయాప్సీ ద్వారా అయితే మరింత
కచ్చితమైన నిర్ధారణ జరుగుతుంది. ఇవే కాకుండా ఎసిటిక్ ఆమ్లం, ల్యూగోల్స్ అయోడిన్ తదితర చవకైన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఏ మేరకు విస్తరించిందో తెలుసుకోవడానికి హిస్టోపాథలాజికల్ లాంటి పరీక్షలు చేయించవచ్చు.
దీర్ఘకాలిక వ్యూహం
తొలిదశలో సర్వికల్ క్యాన్సర్ను సర్జరీతో నయం చేయవచ్చు. కాకపోతే.. కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరమవుతాయి. వ్యాధి ముదిరేకొద్దీ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. రక్షిత శృంగారం ద్వారా కొంతమేర, విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం ద్వారా కొంతమేర.. సర్వికల్ క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చు. 2050 నాటికి సర్వికల్ క్యాన్సర్ను నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. పదిహేను ఏండ్లు వచ్చేసరికి 90 శాతానికిపైగా బాలికలకు వ్యాక్సిన్లు వేయడం, 35 ఏండ్లు వచ్చేప్పటికి 70 శాతం మంది మహిళలకు స్క్రీనింగ్ చేయడం, 45 ఏండ్లు ఉన్నవారిలో 90 శాతం మందికి అత్యాధునిక చికిత్స అందించడం కూడా ఈ వ్యూహంలో భాగమే.
వ్యాక్సినేషన్ కీలకం
సర్వికల్ క్యాన్సర్పై పోరాటంలో టీకా కార్యక్రమం కీలకంగా నిలుస్తున్నది. ప్రస్తుతం సాధారణంగా కనిపించే రెండు హెచ్పీవీ వేరియెంట్లు.. 16, 18కి మాత్రమే టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది 90 శాతం కేసులకు రక్షణనిస్తుంది. మిగతా పదిశాతం రక్షణ కోసం.. సురక్షిత లైంగిక విధానాలను పాటించడం, తరచూ స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి. వ్యాక్సిన్ ఖరీదు కూడా టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడానికి అడ్డుగా నిలుస్తున్నది. దీనిని అధిగమించడానికి.. దేశీయంగా వీలైనన్ని టీకాలను అభివృద్ధి చేసుకోవడమే మార్గం. ఈ క్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా ‘సెరావాక్’ పేరుతో దేశీయ టీకాను అభివృద్ధి చేశాయి. 2022 జూలై 12న మార్కెట్లో తీసుకురావడానికి అనుమతి లభించింది. ఈ టీకా ధరను రూ. 200 నుంచి రూ. 400 మధ్య నిర్ణయించే అవకాశం ఉంది. తొమ్మిది నుంచి పదిహేనేండ్ల బాలికలకు టీకా వేస్తే సర్వికల్ క్యాన్సర్ వైరస్కు 1000 రెట్ల యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. అలా వైరస్ మీద గరిష్ఠ ప్రభావం చూపుతుంది.