లండన్ : కొవిడ్-19 నూతన వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజా అధ్యయనాలు ఈ స్ట్రెయిన్పై సానుకూల అంశాలను వెల్లడించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ బారినపడిన వారు ఆస్పత్రిలో చేరే అవకాశం మూడో వంతు తక్కువగా ఉందని దక్షిణాఫ్రికాలో చేపట్టిన తాజా పరిశోధన స్పష్టం చేసింది. 78,000 ఒమిక్రాన్ కేసులను పరిశీలించిన మీదట అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది.
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఆస్పత్రిలో చేరే ముప్పు అయిదో వంతు తక్కువగా ఉండగా, ఒరిజినల్ వైరస్ కంటే 29 శాతం ముప్పు తక్కువగా ఉందని తేలింది. డెల్టా కేసుల్లో ప్రతి వేయిలో 101 మంది ఆస్పత్రిలో చేరాల్సి రాగా 1000 ఒమిక్రాన్ కేసుల్లో 38 అడ్మిషన్స్ ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. గత స్ట్రెయిన్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ బలహీనమైందని పరిశోధనలో గుర్తించారు. మరోవైపు దక్షిణాఫ్రికాతో పోలిస్తే బ్రిటన్లో పెద్దసంఖ్యలో బూస్టర్ డోసులు పంపిణీ చేయడంతో ఒమిక్రాన్ తీవ్రత పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఒమిక్రాన్ తీవ్రతతో ఆస్పత్రిలో చేరాల్సిరావడం, మరణాల ముప్పు నుంచి 70 శాతం రక్షణ ఇస్తున్నట్టు వెల్లడైంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో 63 శాతం వరకూ రక్షణ లభిస్తోందని తేలింది. ఈ రెండు వ్యాక్సిన్లు పూర్తి డోసు తీసుకున్న వారిలో మూడు నుంచి ఆరు నెలల్లో యాంటీ బాడీలు తగ్గడం ఆందోళన రేకెత్తిస్తోంది. బూస్టర్ డోసులతో ఒమిక్రాన్ సహా ఇతర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.