న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరినీ ఒత్తిడి చిత్తు చేయడంతో పాటు సరైన ఆహార అలవాట్లు కొరవడటంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. ఎల్డీఎల్గా పిలిచే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా హృద్రోగాలు, స్ట్రోక్ ముప్పు ముంచుకొస్తుంది. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను సరైన లెవెల్స్లో ఉంచేందుకు వైద్యులు స్టాటిన్స్ను వాడాలని సూచిస్తుంటారు.
ఈ తరహా మందులతో పాటు సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. రిఫైన్డ్ చక్కెరలు, ఉప్పు, తీపిపదార్ధాలను తగ్గించాలని సలహా ఇస్తారు. ఈ సలహాలు పాటిస్తూనే ఎల్డీఎల్ లెవెల్స్ను మెరుగ్గా మేనేజ్ చేసేందుకు చాలా మంది ఇష్టంగా తీసుకునే పుదీనా కొత్తిమీర చట్నీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ ఇన్స్టాగ్రాం పోస్ట్లో వెల్లడించారు. కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో వచ్చే అనారోగ్య సమస్యలను నివారించేందుకు కొలెస్ట్రాల్ నియంత్రణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్యకర ఆహారం తీసుకోవడానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పోస్ట్లో ఆమె రాసుకొచ్చారు.
రుచి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొలెస్ట్రాల్ తగ్గించే వంటకాన్ని తాను ప్రజల ముందుకు తీసుకువచ్చానని ఈ పోస్ట్కు ఆమె క్యాప్షన్ ఇచ్చారు. పుదీనా కొత్తిమీర చట్నీ కోసం పుదీనా, కొత్తిమీరతో పాటు ఫ్లాక్స్సీడ్స్ ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం వాడుతూ ఈ టేస్టీ చట్నీని చేసుకోవచ్చని సూచించారు. ఈ చట్నీ తరచూ తీసుకోవడం ద్వారా మలబద్ధకం దూరమవడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీ, మధుమేహం నియంత్రణలో ఉంటాయని, కడుపుబ్బరం తగ్గుతుందని అంజలి ముఖర్జీ చెప్పుకొచ్చారు.