Nipah Virus | కేరళను నిపా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రోజు రోజుకు వైరస్ విస్తరిస్తుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరో వైపు వెయ్యి మంది సైతం పరీక్షలు చేస్తున్నారు. కోజికోడ్ జిల్లాలో మొదలైన వైరస్.. 30 నగరాలకుపైగా వ్యాపించింది. ఈ పరిస్థితుల్లో కేరళ ఆరోగ్యశాఖ పొరుగు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. నిపాను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిపాతో మరణాల రేటు 40-70శాతం మధ్య ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైరస్పై పలువురి మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా అంత ప్రమాదకరమా..? ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందా..? అను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..!
భారత్లో వెలుగు చూసిన ఈ నిపా వైరస్ వేరియంట్ బంగ్లాదేశ్కు చెందినదిగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వేరియంట్ గురించి సమాచారం బయపటడింది. ఇది డెడ్లీ వైరస్ అని, ప్రాణాపాయ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మలేషియా, బంగ్లాదేశ్లో ప్రధానంగా రెండు రకాల నిపా వైరస్లున్నాయి. మలేషియా వేరియంట్లో ఒక వ్యక్తి నుంచి నిపా వైరస్ మరో వ్యక్తికి సంక్రయించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే, బంగ్లాదేశ్లో వెలుగు చూసిన వైరస్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే లక్షణాలున్నట్లు గుర్తించారు.
నిపా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అందరి మదిలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా? సోకితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ? సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరి సోకుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వైరస్ సోకిన వ్యక్తి శరీరం నుంచి వచ్చిన స్రావాలు, మూత్రం, రక్తంతో పాటు తుమ్ముల నుంచి వచ్చే బింధువులను పీల్చిన సమయంలో వైరస్ సోకుతుందని నిపుణులుపేర్కొన్నారు. అయితే, కేరళలో ఎక్కువ కేసుల్లో హెల్త్కేర్ వర్కర్లు ఎక్కువగా ఉండడమే దీనికి ఉదాహరణ అని పేర్కొంటున్నారు.
నిపా వైరస్ ఎవరికైనా సోకుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే, రోగ నిరోధశక్తి ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారికి అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరస్ గబ్బిలాలు, పందుల నుంచి మనుషులకు సోకుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గబ్బిలాల మలంతో కలుషితమైన పండ్లను తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని పలు అధ్యయనాలు సైతం పేర్కొన్నాయి. వైరస్ బారినపడకుండా ఉండేందుకు పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతనే తీసుకోవాలని, అలాగే భోజన సమయానికి చేతులను శానిటైజ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.