న్యూఢిల్లీ : వేగంగా మారుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ తాజా వేరియంట్ భారత్, అమెరికా సహా పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న తీరు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. బీఏ 2.75గా పిలుస్తున్న ఈ వేరియంట్ వేగంగా ప్రబలుతోంది. ఈ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బీఏ.5 కంటే ప్రమాదమైనదా, వ్యాధి తీవ్రత వంటి వివరాలపై ఇంతవరకూ స్పష్టత లేదు.
ఈ వేరియంట్పై అప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నామని మిన్నెసొటకు చెందిన మయో క్లినిక్లో క్లినికల్ వైరాలజీ డైరెక్టర్ మ్యాథ్యూ బినికర్ పేర్కొన్నారు. భారత్లో ఈ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉందని వెల్లడవుతోందని చెప్పారు. బీఏ 5ను బీఏ 2.75 అధిగమిస్తుందా అనేది కూడా ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.
అయితే తక్కువ వైరల్ వ్యాప్తి ఉన్న దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు గుర్తించడం దీని వ్యాప్తికి సంకేతాలు పంపుతున్నట్టే అర్ధం చేసుకోవాలని అన్నారు. బీఏ 2.75 వేరియంట్ను భారత్ సహా ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి పది దేశాల్లో గుర్తించారు.