Nairobi Fly | ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇంకా దేశాన్ని వణికిస్తున్నది. కొవిడ్-19తో పాటు పలు రకాల వైరస్లు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో టమాట ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో కొత్తగా ‘నైరోబీ ఫ్లై’ కలకలం రేపుతున్నది. పశ్చిమ బెంగాల్, సిక్కీతో పాటు బిహార్లో కేసులు నమోదయ్యాయి. సిక్కింలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వందమందికిపైగా విద్యార్థులకు ఈ ‘నైరోబీ ఫ్లై’ సోకింది. ఆ తర్వాత బిహార్లోనూ పలు కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒళ్లంతా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, సాయంత్రం సమయంలో బయటకు వెళ్లొద్దని, దోమతెరలను వినియోగించాలని సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు.
తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్తో తొలిసారిగా దీన్ని గుర్తించారు. దీన్ని ‘నైరోబీ ఫ్లై’గా పిలుస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పెడెరిన్ అనే విషపూరితమైన ఆమ్ల పదార్థాన్ని మానవ శరీరంపై విడుదల చేస్తుంది. ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు కారణమవుతుంది. పెడెరిన్తో మంట, తీవ్రమైన చికాకు కలిగిస్తుంది. ఇప్పటివరకు ‘నైరోబీ ఫ్లై’ కేసులు ఎక్కువగా దక్షిణ సూడాన్లో కనిపించాయి.
నైరోబీ ఫ్లై ఇన్ఫెక్షన్.. నైరోబీ ఫ్లైస్ సోకుతుంది. ఈ కీటకాలు చిన్న సైజులో నారింజ, నలుపురంగులో ఉంటాయి. ఇవి ప్రకాశవంతమైన కాంతి, తేమ ప్రాంతాలు వీటిని బాగా ఆకర్షిస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. నైరోబీ ఈగలు కుట్టవు. మానవ శరీరంపై వాలడం ద్వారా ఆమ్లం చర్మానికి అంటుతుంది. నైరోబీ ఫ్లైస్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పెడెరిన్ అనే ఆమ్ల పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ కీటకాలు విడుదల చేసే ద్రవం చర్మంపై అసాధారణ మంట, వాపు లేదంటే పుండ్లకు కారణమవుతుంది. ఈగలు చర్మంపై వాలిన 24 నుంచి 48 గంటల్లోపు పసుపు రంగు ద్రవంతో నిండిన బొబ్బలు చర్మంపై కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి, చికిత్స అందించడం అవసరమని.. నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో ఈ కీటకాల్లో ఉండే విషపూరితమైన ఫెడెర్రిన్ మరింత ప్రభావంతంగా ఉంటుంది. దీంతో జ్వరం, నరాల సమస్యలు, కీళ్ల నొప్పులు, చర్మవ్యాధులతో పాటు వాంతులు తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. విష పదార్థం వ్యక్తి కళ్లకు తాకితే.. ఇన్ఫెక్షన్ కళ్లకు సైతం సోకుతుంది. తీవ్రమైన సందర్భాల్లో కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ప్రమాదం విషయంలో ప్రజలందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇన్ఫెక్షన్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నైరోబీ ఫ్లైస్ ప్రకాశవంతమైన వెలుతురు, తేమ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కాంతి మధ్యస్తంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, శరీరాన్ని కప్పి ఉంచేలా నిండుగా దుస్తులు ధరించాలని, అలాగే అనవసరంగా కళ్లను తాకడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఈగలు వాలిన కొద్దిసేపటి
తర్వాతనే లక్షణాలు కనిపిస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. చర్మంపై దురద, దద్దుర్లు కనిపించినా భయపడకుండా వైద్యుడి వద్దకు వెళ్లి.. సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రత నుంచి వేగంగా బయటపడవచ్చు.