‘మల్టిపుల్ స్లిరోసిస్’… నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఇది రెండు ప్రధాన అవయవాలైన మెదడు, వెన్నుపాముకు సంబంధించిన వ్యాధి అన్నమాట. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రోగ నిరోధక శక్తి ఒక్కోసారి మన శరీరంలోని మన సొంత కణాలనే శత్రుకణాలుగా పరిగణించే అవకాశం ఉంది. అంటే కంచె చేను మేసినట్టుగా అన్నమాట. అయితే ప్రధానంగా జన్యువులలో తేడా ఉండి వాటిపై వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటివి బాల్యంలో వచ్చినప్పుడు, వాటికి బయటి వాతావరణ పరిస్థితులు తోడైనప్పుడు మల్టిపుల్ స్లిరోసిస్(ఎంఎస్) వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఎంఎస్ వ్యాధి రావడానికి గల కారణాలేంటి? దీనివల్ల కలిగే అనర్థాలు, వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, చికిత్సా విధానం మొదలైన అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
సాధారణంగా నరాలు వేరు. రక్తనాళాలు వేరు. శరీరంపై మనకు కనిపించేవి రక్తనాళాలు. ఇక నరాలేమో కండరాల మధ్యలో మైలిన్ అనే పొరతో కప్పబడి ఉంటాయి. అందువల్ల అవి బయటకు కనిపించవు. కరెంటు వైర్లో రాగి తీగపై రబ్బరు తొడుగు ఎలా ఉంటుంటో ప్రతి నరంపై దాన్ని సంరక్షించేందుకు ఒక తొడుగు ఉంటుంది. మైలిన్ పొర అంటే ఇదే. నరాలపై ఉన్న ఈ మైలిన్ పొర దెబ్బతినడాన్ని డీమైలేషన్ అంటారు. డీమైలేషన్ కారణంగా మల్టిపుల్ స్లిరోసిస్ వ్యాధి వస్తుంది.
భారతదేశంలో మల్టిపుల్ స్క్లిరోసిస్ తీవ్రత పెరుగుతూ వస్తున్నది. గతంలో కేవలం విదేశాలలో మాత్రమే ఉండేదని భావించేవాళ్లు. కానీ, మనదగ్గర వైద్యరంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ సమస్య మన దేశంలో కూడా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మామూలుగా మల్టిపుల్ స్లిరోసిస్ ఎక్కువగా 15 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు యువతులు, మహిళల్లో కనిపిస్తుంది. పురుషులతో పోల్చితే ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 30-40 ఏండ్ల వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది మహిళలు గర్భధారణ విషయంలో ఆందోళనకు గురవుతారు. కానీ, మల్టిపుల్ స్లిరోసిస్ పీడిత మహిళలు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ గర్భధారణకు వెళ్లవచ్చు. ఇప్పుడు గర్భిణులకు సైతం పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కాగా, మల్టిపుల్ స్ల్కిరోసిస్లో రెండు దశలు ఉన్నాయి. ఒకటి రీలాప్సింగ్ మల్టిపుల్ స్లిరోసిస్, రెండోది ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్లిరోసిస్.
సాధారణంగా ఒక అవయవంపై మల్టిపుల్ స్లిరోసిస్ దాడిచేసి కోలుకున్న తర్వాత, మరో అవయవంపై ఈ వ్యాధి దాడిచేస్తుంది. ఉదాహరణకు కంటిలో వాపు లేదా చూపు మందగించడం జరిగినప్పుడు చికిత్సతో కోలుకున్న కొంతకాలం తర్వాత మరో అవయవం దెబ్బతింటుంది. అంటే మెదడు లేదా వెన్నుపాములోని కాలు లేదా చేయికి సంబంధించిన నాడీకణాల మీద డీమైలేషన్ ప్లాక్ ఏర్పడుతుంది. కొన్ని రోజులకు ఇది కూడా తగ్గిపోతుంది. అయితే, రోగి కొన్నిసార్లు ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటాడు. కానీ, ఇది మళ్లీమళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నాడీకణాలపై తరచుగా దాడిచేస్తుంది కాబట్టి దీనిని ‘రీలాప్సింగ్ మల్టిపుల్ స్లిరోసిస్’అని పేర్కొంటారు. ఈ వ్యాధిని ఎంఆర్ఐ ద్వారా లేదా ‘సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్’ (సీఎస్ఎఫ్) వెన్నుపూసలో నుంచి నీరు తీయడం వంటి వైద్యపరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఎంఆర్ఐ ద్వారా భవిష్యత్తులో మళ్లీ నాడీ వ్యవస్థ ఎంత తరచుగా డీమైలేషన్కు గురవుతుందో కూడా ఓ అంచనాకు రావచ్చు. 1995 వరకు దీనికి మందులు అందుబాటులో లేవు. ఇప్పుడు చాలా రకాల ఔషధాలు లభిస్తున్నాయి. సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే రీలాప్సింగ్ మల్టిపుల్ స్లిరోసిస్ అభివృద్ధి చెందకుండా చూడవచ్చు. రోగికి సాధారణ జీవితం అందించవచ్చు.
రీలాప్సింగ్ దశలో చికిత్స అందించకపోవడం వల్ల వ్యాధి ముదిరిపోయి హఠాత్తుగా నడక దెబ్బతినడం, కాళ్లు బ్యాలెన్స్ తప్పడం వంటివి చోటుచేసుకుంటాయి. ఈ విధంగా రీలాప్సింగ్తో మొదలై కాలక్రమంలో ప్రోగ్రెస్సివ్ మల్టిపుల్ స్లిరోసిస్గా మారవచ్చు. ప్రోగ్రెసివ్ దశలో రోగిలో నడక, సంతులనం, జ్ఞానం నెమ్మదిగా క్షీణిస్తూ ఉంటాయి. ఇక సమస్య ప్రోగ్రెసివ్ దశకు చేరుకుంటే రోగికి చికిత్స అందించడం చాలా కష్టం. నిజం చెప్పాలంటే రీలాప్సింగ్ దశలో ఉన్నప్పుడే తగిన చికిత్స చేయకపోతే ఓ పది పదిహేను ఏండ్లలో రోగి చక్రాల కుర్చీకే పరిమితమై పోతాడు. అయితే, ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్లిరోసిస్కు కూడా ఇప్పుడు మందులు అందుబాటులో ఉన్నాయి.
ఏవైనా వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అవి మన రోగ నిరోధక వ్యవస్థతో పోరాడతాయి. ఈ క్రమంలో మన శరీరంలో కొన్ని రకాల కణాలు, యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ మీద దాడిచేస్తున్న ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. కానీ, కొన్నిసార్లు మన సొంత కణాలు, ఇన్ఫెక్షన్లలోని రోగ కారకాల (ఇన్ఫెక్షన్ ఏజెంట్స్)కు దగ్గరగా ఉంటాయి. దీంతో మన శరీరంలో ఉత్పత్తి అయిన కణాలు మన శరీరంపైనే దాడిచేస్తాయి. అంటే మన రోగ నిరోధక వ్యవస్థనే మన శరీరంపై దాడి చేస్తుందన్నమాట. దీన్నే ఆటోఇమ్యూన్ కండిషన్ అంటారు. ఈ పరిస్థితి దాపురించినప్పుడు నరాలపై రక్షక కవచంగా ఉన్న మైలిన్పొర దెబ్బతిని డీమైలేషన్ జరుగుతుంది. అలా మల్టిపుల్ స్లిరోసిస్ సంక్రమిస్తుంది.
వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మెరుగైన చికిత్స అందించవచ్చు. ఎంఆర్ఐ, సీఎస్ఎఫ్ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించి వైద్యులు తగిన చికిత్స చేస్తారు. మల్టిపుల్ స్లిరోసిస్ స్వల్పంగా ఉంటే తక్కువ మోతాదులో మందులు ఇవ్వాల్సి ఉంటుంది. మాత్రలు, ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మల్టిపుల్ స్లిరోసిస్ రోగులకు ప్రధానంగా రెండు రకాల చికిత్స అందించవచ్చు. ఒకటి అక్యూట్ రీలాప్స్ ట్రీట్మెంట్. రెండోది రీలాప్స్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్. అక్యూట్ ట్రీట్మెంట్ విధానంలో స్టిరాయిడ్స్, ప్లాస్మా మార్పిడి, ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్తో చికిత్స చేస్తారు. రీలాప్సింగ్ ప్రివెన్షన్ (డీఎంటీ ట్రీట్మెంట్)లో ఇంజెక్షన్లు, మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైతే కొంతమందికి హిమాటోపైటిక్ స్టెమ్సెల్ మార్పిడి చికిత్స కూడా చేస్తారు. ఇది అందరికీ సాధ్యపడదు.