Endometriosis | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా ఆరోగ్య సమస్య పెరుగుతున్నాయి. గత దశాబ్దపు గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ తదితర వ్యాధులు ఇబ్బందికరంగా మారాయి. అయితే, కొన్ని వ్యాధులు మహిళలకు ప్రభావితం చేస్తున్నాయి. సరైన రోగ నిర్ధారణ, చికిత్స లేకపోవడంతో వల్ల పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో భారత్లో దాదాపు 4.3 కోట్ల మంది మహిళలు ఎండ్రోమెట్రియోసిస్తో బాధపడుతున్నట్లుగా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇది పునరుత్పత్తి సమస్యలకు ప్రధాన కారణంగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వంధ్యత్వం తదిత సమస్యలకు సైతం దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. యువతులు సైతం దీని బారినపడుతున్నారు.
ఎండ్రోమెట్రియోసిస్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19 కోట్ల మంది ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. భారత్లో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న 10శాతం మంది మహిళల్లో ఈ సమస్యను గుర్తించారు. జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్లోని భారతీయ పరిశోధకులు దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎండోమెట్రియోసిస్పై శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. చాలా మంది మహిళలకు ఈ సమస్య ఉన్నట్లు తెలియకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. అవగాహన లోపంతో వ్యాధికి సకాలంలో చికిత్స అందడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న మహిళలు తరచుగా నొప్పి (పెల్విక్, బ్యాక్ అబ్డామిన్)తో బాధపడుతుంటారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మెనుస్ట్రువల్ సైకిల్లో శరీరంలోని హార్మోన్ల మార్పుల కారణంగా ఎండోమెట్రియల్ (lining of the uterus) వంటి కణజాలంలోని కణాలు పెరగడం ప్రారంభిస్తాయని, ఆ తర్వాత విచ్ఛిన్నమవుతాయి. దాంతో రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది.
పీరియడ్స్ సమయంలో రక్తం శరీరం నుంచి బయటకు వెళుతుంది. అయితే, కణాల విచ్ఛిన్నంతో కలిగే రక్తస్రావం శరీరం లోపల ఉండిపోతుంది. ఇది వాపుతో పాటు అనేక సమస్యలకు దారి తీస్తుంది. సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, పునరుత్పత్తి సమస్యలకు దారి తీస్తుంది.
గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ ప్రోగ్రామ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో డాక్టర్ ప్రీతి రాజ్బంగ్షి మాట్లాడుతూ పీరియడ్స్ సమయంలో నొప్పిపై శ్రద్ధ లేకపోవడం, ఎండోమెట్రియోసిస్ సమస్యపై అవగాహన లేకపోవడంతో వ్యాధి సకాలంలో గుర్తించలేకపోతున్నట్లు తెలిపారు. ఇది అంతర్గతంగా తీవ్రమైన సమస్యలను పెంచుతుందన్నారు. మహిళల్లో ఎండోమెట్రియోసిస్ ముందస్తు రోగనిర్ధారణ, చికిత్సను మెరుగుపరచాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయన్నారు. లక్షణాలపై శ్రద్ధ వహించడంతో పాటు వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు.
ఎండోమెట్రియోసిస్తో బాధపడే మహిళల్లో పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు, నొప్పి, కడుపు, వెన్నులో విపరీతమైన నొప్పి, శృంగారంలో పాల్గొనే సమయంలో నొప్పి, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం తదితర లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎండోమెట్రియోసిస్తో జాగ్రత్తలు తీసుకోకపోతే గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సమస్య బారినపడ్డ వారుంటే ఉంటే.. మిగతా వారు ఎండోమెట్రియోసిస్ బారినపడే ప్రమాదం బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రుతుస్రావం సమయంలో ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు.