న్యూయార్క్ : కొవిడ్-19 తాజా వేరియంట్ ఒమిక్రాన్ను సమర్ధంగా ఎదుర్కొనేలా తమ బూస్టర్ వ్యాక్సిన్ యాంటీబాడీ లెవెల్స్ను గణనీయంగా పెంచుతుందని బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా వెల్లడించింది. బూస్టర్ డోసులకు ముందున్న యాంటీబాడీలతో పోలిస్తే 50 మైక్రోగ్రాముల బూస్టర్తో యాంటీబాడీలను 37 రెట్లు పెంచుతాయని, 100 మైక్రోగ్రాముల బూస్టర్తో యాంటీబాడీలు ఏకంగా 83 రెట్లు పెరుగుతాయని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కలవరపరుస్తోందని, తమ బూస్టర్ డోసులతో యాంటీబాడీల లెవెల్స్ అనూహ్యంగా పెరుగుతాయని వెల్లడవడం భరోసా ఇస్తోందని మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బన్సెల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బూస్టర్ వ్యాక్సిన్ 100 మైక్రోగ్రామ్ డోస్ సురక్షితమైనదని, ఎలాంటి ముఖ్యమైన సైడ్ఎఫెక్ట్స్ తలెత్తలేదని రెండో దశ అధ్యయనంలో తేలిందని చెప్పారు.
గత ఏడాది నవంబర్లో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో తమ వ్యాక్సిన్ సామర్ధ్యం రేటు 94.1 శాతంగా ఉందని మోడెర్నా ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ భాగస్వామ్యంతో కొవిడ్-19 వ్యాక్సిన్ను మోడెర్నా అభివృద్ధి చేసింది.