న్యూయార్క్ : కెనడా, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ (Skin Cancer) కేసులు పెరుగుతున్న క్రమంలో మెక్గిల్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. పురుషులు, సంపన్న వర్గాల వారు అధికంగా చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ స్టడీలో తేలింది. అల్ట్రా వయలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం, వివిధ వర్గాల వారి స్వభావాలను అంచనా వేసిన అనంతరం ఈ విషయాలను వెల్లడించింది. ఆదాయం, విద్య, జెండర్ వంటి పలు అంశాల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
అధికాదాయం కలిగిన వ్యక్తులు, పురుషులు ఎక్కువగా చర్మ క్యాన్సర్ మెలనోమా బారినపడుతున్నారని పేర్కొంది. అధికాదాయం కలిగిన వ్యక్తులు మెలనోమా ముప్పును అధికంగా ఎదుర్కొంటున్నారని అధ్యయనం వెల్లడించింది. వీరు జీవితంలో అధిక సమయం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడంతో పాటు మురికితో కూడిన బెడ్లపై ఎక్కువ సమయం గడపడమే కారణమని పేర్కొంది. మహిళలతో పోలిస్తే పురుషులు సన్ ప్రొటెక్షన్కు ఎలాంటి కేర్ తీసుకోకపోవడమూ ఓ కారణమని అధ్యయనం తెలిపింది.
సంపన్న వర్గాలు ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అయ్యేలా విహార యాత్రలకు తరచూ వెళుతుంటారని రిక్రియేషనల్ ట్యానింగ్కు గురవుతుంటారని ఇది వారిలో మెలనోమాకు దారితీస్తుందని మెక్గిల్ వర్సిటీలో డెర్మటాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇవన్ లిట్వినవ్ చెప్పారు. మరోవైపు ఏడాదికి 50,000 డాలర్లలోపు సంపాదించే వారు అధికంగా అవుట్డోర్స్లో పనిచేస్తూ వృత్తిపరంగా ఎండలో అధికసమయం వెచ్చించాల్సి రావడంతో వారిలో చర్మ క్యాన్సర్ తలెత్తే ముప్పు అధికంగా ఉందని అధ్యయనం వెల్లడించింది.
బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు చేపట్టడం ద్వారా మెలనోమా ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు సూచించారు. చర్మ క్యాన్సర్ను నిరోధించాలంటే సన్స్క్రీన్ లోషన్స్ వాడటం సమర్ధవంతమైన నియంత్రణ చర్యల్లో ఒకటని డాక్టర్ లిట్వినవ్ చెబుతున్నారు. చర్మ క్యాన్సర్ను తగ్గించేందుకు ప్రజారోగ్య విధానాలు రూపొందించడంలో నిర్ధిష్ట వర్గాల ఆధారంగా నిర్ధిష్ట విధానాలను అనుసరించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మెలనోమా కేసులు పెరుగుతున్న క్రమంలో దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.
Read More :