కరోనా ప్రభావంతో విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినక తప్పని పరిస్థితి. గంటల తరబడి మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లకు అంకితమవుతున్నారు. దీంతో, పెద్దలకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పిల్లల స్క్రీన్ టైమ్ పెరగడంతో భయాందోళనలు అధికమవుతున్నాయి. దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.
మొబైల్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ఇతరత్రా డివైజ్లపై గడిపే మొత్తం సమయాన్ని ‘స్క్రీన్ టైమ్’ అంటారు. గ్యాడ్జెట్స్ వాడకానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది. దానిపైనే మంచిచెడులు ఆధారపడి ఉంటాయి. విద్యావసరాలకు, స్నేహితులను, బంధువులను సంప్రదించడానికి ఉపయోగపడటం టెక్నాలజీలోని మంచికి నిదర్శనాలు. అసంబద్ధమైన టీవీ షోలు, చెత్త సినిమాలు, ఉపయోగపడని వెబ్సైట్లు చూడటం, హింసాత్మక గేమ్స్ ఆడటం.. ఇవన్నీ చెడుకు దారితీస్తాయి. సాధారణంగా పిల్లలు గ్యాడ్జెట్స్కు అలవాటుపడటానికి కొంతమేర తల్లిదండ్రులే కారణం. చిన్నపిల్లలకు అన్నం తినిపించడానికో, ఏడుస్తున్నప్పుడు బుజ్జగించడానికో సెల్ఫోన్, ల్యాప్టాప్ అలవాటు చేస్తుంటారు. అల్లరిని అదుపు చేయడానికి ప్రోత్సహించే ఈ అలవాటే తర్వాత తలనొప్పిగా మారవచ్చు. చిన్నారులను వీలైనంత వరకు గ్యాడ్జెట్స్కు దూరంగా ఉంచాలి.
రెండున్నరేండ్ల పిల్లలకు స్క్రీన్టైమ్ గంట దాటకూడదు. టీవీ, ఫోన్ ఏదైనా గంట లోపే. ఈ సమయం ఎంత తక్కువైతే అంత మంచిది. ఆపై వయసున్న పిల్లల విషయంలో స్క్రీన్ టైమ్ తగ్గించేలా, ఏవైనా పనుల్లో నిమగ్నం చేయాలి. ఆటలు, ఇతర యాక్టివిటీస్లో పాలుపంచుకొనేలా చూడాలి. ఎనిమిది గంటల పాటు నిద్ర పోయేలా చూసుకోవాలి. రోజూ గంటపాటైనా శరీరానికి అలసట కలిగించే ఆటలు ఆడించాలి. ఇంటి పనుల్లో భాగం చేయాలి. తద్వారా వారికి సరైన సమయంలో ఆకలి వేస్తుంది. అంతేకాదు, పిల్లలతో తల్లిదండ్రులు కాసేపు సరదాగా గడిపితే పిల్లలకు ఫోన్ చూడాలనే ఆరాటమే కలుగదు. ఫలితంగా, స్క్రీన్టైమ్ తగ్గే వీలుంటుంది. పిల్లల కండ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ ప్రభావం మానసికంగానూ రిలీఫ్ ఇస్తుంది.
స్క్రీన్టైమ్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. పిల్లల్లో సృజనాత్మకత పెరిగేలా గ్యాడ్జెట్స్ను సద్వినియోగం చేసుకోవాలి. వెబ్సైట్లను నియంత్రించాలి. క్లాసులు, హోమ్వర్క్ తదితర అవసరాలకు మాత్రమే కంప్యూటర్ని వినియోగించేలా చూసుకోవాలి. సామాజిక మాధ్యమాల ఉచ్చులో చిక్కుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు