వర్షాకాలం వచ్చేసింది. వానలు కురుస్తుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ వర్షాలు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అనేక వ్యాధులను మోసుకొస్తాయి. మలేరియా అలాంటి వ్యాధుల్లో ఒకటి. ఇది తీవ్రమైనది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణంగా ఆడ అనాఫిలిస్ దోమనుంచి సంక్రమించే పరాన్నజీవి వల్ల మలేరియా సోకుతుంది. అధిక జ్వరం, వణుకు, విరేచనాలు, వాంతులు, ఫ్లూ లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిపరమ్, పీ వైవాక్స్, పీ ఓవేల్, పీ మలేరియా.. దోమల ద్వారా మానవులకు వ్యాపిస్తాయి. ఇవి తీవ్రమైన పరిణామాలకు కారణమయ్యే అవకాశం ఉంది.
2020 లో డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 241 మిలియన్ల మలేరియా క్లినికల్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 6, 27,000 మంది మృతిచెందారు. వారిలో ఎక్కువ మంది ఆఫ్రికాకు చెందిన పిల్లలున్నారు. కాగా, కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటే మలేరియాను సులభంగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.