న్యూయార్క్ : కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారిలో రెండేండ్ల తర్వాత కూడా సగం మందిలో ఇన్ఫెక్షన్కు సంబంధించి కనీసం ఒక లక్షణం కనిపిస్తోందని మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.
సాధారణ జనాభాతో పోలిస్తే కొవిడ్-19 నుంచి బయటపడినవారి ఆరోగ్య పరిస్థితి కుదురుగా లేదని పేర్కొంది. కొవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో లాంగ్ కొవిడ్, పోస్ట్ కొవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఈ ముప్పును నివారించేందుకు చికిత్సా విధానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం నొక్కిచెప్పింది.
ఇక అంతకుముందు వెల్లడైన బ్రిటన్ అధ్యయనం కరోనా సోకిన నలుగురు రోగుల్లో కేవలం ఒకరు మాత్రమే ఇన్ఫెక్షన్ సోకిన ఏడాది తర్వాత పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోందని తెలిపింది. సమగ్ర చికిత్సా విధానంతోనే లాంగ్ కొవిడ్, పోస్ట్ కొవిడ్ లక్షణాల నుంచి రోగులు బయటపడవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది.