మధుమేహంతో బాధపడేవారికి ఆహార నియమాలు చాలా కీలకం. చిరుధాన్యాలలో ముఖ్యమైన రాగులు Finger Millet పోషకాలకు, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. వీటితో తయారుచేసే రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతారు. అయితే.. షుగర్ ఉన్నవాళ్లు రాగి జావను తాగొచ్చా… ఒకవేళ తాగితే ఎంత మోతాదులో తీసుకోవాలి?.. రాగి జావతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకుందాం
రాగి జావ తాగితే షుగర్ లెవెల్ పెరుగుతుందా ?
సాధారణంగా, రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. నిజానికి, ఇతర శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి పానీయం.
తక్కువ లేక మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది : రాగుల గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ 54 నుండి 68 మధ్య ఉంటుంది, ఇది మధ్యస్థ పరిధిలోకి వస్తుంది. అయితే, వండిన తరువాత జావ లేక రాగి ముద్ద రూపంలో ఇది సుమారు 55 వరకు తగ్గి, తక్కువ GI పరిధికి దగ్గరగా ఉంటుంది. దీని అర్థం, రాగి జావలోని గ్లూకోజ్ రక్తంలోకి చాలా నెమ్మదిగా, క్రమంగా విడుదలవుతుంది.
అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది
రాగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ శోషణ కూడా నెమ్మదిగా జరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
పాలీఫెనాల్స్ : రాగులలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
డయాబెటిక్ ఉన్నవాల్లు రాగి జావను ఇలా తీసుకోండి ?
చక్కెర, స్వీటెనర్లు వేసుకోవద్దు. జావ తయారీలో చక్కెర, బెల్లం, తేనె లేదా ఇతర కృత్రిమ స్వీటెనర్లను అస్సలు వాడకూడదు. ఇవి జావ యొక్క తక్కువ GI ప్రయోజనాన్ని పూర్తిగా నాశనం చేసి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. రాగి జావలో ఉప్పు, మజ్జిగ లేదా పెరుగు కలిపి తీసుకోవడం ఉత్తమం. పెరుగు లేక మజ్జిగలో ఉండే ప్రోటీన్ మరియు కొవ్వు జావ యొక్క గ్లైసెమిక్ ప్రభావాన్ని మరింత తగ్గిస్తుంది. ఉదయం అల్పాహారంలో ఒక కప్పు అంటి సుమారు 150-200 మి.లీ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువై షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
రాగి జావతో పాటు లేదా దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, వంటివి కలపడం మంచిది. ఇది పోషకాల సమతుల్యతను పెంచి, సంతృప్తిని ఇస్తుంది మరియు గ్లూకోజ్ శోషణను మరింత నెమ్మదిస్తుంది.
సూచన : రాగుల్లో కూడా కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే సరిపోతుంది. రాగి జావ డయాబెటిస్ ఉన్నవారికి దివ్య ఔషధం వలె పనిచేస్తుంది. దానిలోని తక్కువ లేక మధ్యస్థ GI మరియు అధిక ఫైబర్ కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే, చక్కెర కలపకుండా, సరైన మోతాదులో, మజ్జిగ లేదా పెరుగు వంటి ప్రోటీన్-రిచ్ ఆహారాలతో కలిపి తీసుకోవడం ద్వారా దీని పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.