India Corona | దేశవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ ఉధృతమవుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,112 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇలా 10 వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం. శుక్రవారం కొత్తగా 12,193 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం బయపడిన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కు చేరింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 26.46 శాతంగా ఉంది. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 1,515 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో కొత్తగా 850 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మరణించారు. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్ మరీ అంత శక్తిమంతమైనది కాదని పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా వెల్లడించారు. ఈ వేరియంట్ కొంతవరకు మాత్రమే ప్రభావం చూపగలదని చెప్పారు.
ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, కౌమార బాలబాలికలు కొవిడ్-19 టీకాలు అదనంగా తీసుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా సలహా ఇచ్చింది. అయితే, ఇతర టీకాలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. రోటావైరస్, తట్టు (మీజిల్స్), న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ లాంటి అత్యవసర సంప్రదాయ టీకాలతో పోలిస్తే పిల్లలు, కౌమార బాలబాలికల మీద కొవిడ్ టీకాల ప్రభావం చాలా తక్కువని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఆ కొవిడ్ 19 టీకాలను వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వర్గాలకు కేటాయిస్తే మంచిదనీ పేర్కొన్నది.