Dehydration | సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో డీహైడ్రేషన్ (శరీరంలో నీటి లోపం) కూడా ఒకటి. ఇది కేవలం ఎండాకాలం లేదా కఠినమైన వ్యాయామం చేసే వాళ్లకే వచ్చే సమస్య కాదు. రోజువారీ జీవితంలో చిన్నచిన్న అలవాట్ల వల్ల చాలా మంది తెలియకుండానే దీర్ఘకాలిక డీహైడ్రేషన్కు గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు, వృద్ధులు వంటి వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నీరు తాగడం మర్చిపోవడం, టీ-కాఫీలపై ఎక్కువగా ఆధారపడడం, దాహం వేయకపోతే నీరు అవసరం లేదనుకోవడం వంటి అలవాట్లు శరీరంపై నెమ్మదిగా ప్రభావం చూపిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం దాహం వేయడం అనేది శరీరంలో నీటి లోపానికి ముందస్తు సంకేతం కాదు. దాహం అనిపించే సమయానికి శరీరం అప్పటికే స్వల్ప స్థాయిలో డీహైడ్రేషన్కు గురై ఉంటుందని వారు చెబుతున్నారు.
ముఖ్యంగా వృద్ధుల్లో దాహం గుర్తించే శక్తి తగ్గిపోవడంతో ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. రోజంతా ఏసీ గదుల్లో కూర్చుని పని చేసే వారికీ కూడా శరీరం శ్వాస, చెమట, మూత్రం ద్వారా నిరంతరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల శరీరంపై అనేక రకాల ప్రభావాలు కనిపిస్తాయి. సరిపడా నిద్రపోయినా అలసటగా అనిపించడం, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి మందగించడం, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే కండరాల పట్టుకుపోవడం, జీర్ణక్రియ మందగించడం, మలబద్ధకం, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో చిరాకు, ఆందోళన వంటి మానసిక మార్పులు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో డీహైడ్రేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో శరీరం మరింత నీటిని కోల్పోతుంది. డీహైడ్రేషన్ పెరిగితే రక్తంలో గ్లూకోజ్ మరింత సాంద్రత చెందుతుంది. ఇలా ఇది ఒక ప్రమాదకర చక్రంలా మారుతుంది.
వృద్ధుల్లో అయితే మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు, తక్కువ రక్తపోటు, తూలి పడిపోవడం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అయితే ఎక్కువ నీరు తాగితే సరిపోతుందనే భావన పూర్తిగా సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి నీటితోపాటు ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం. సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్ వంటి ఖనిజాలనే ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి శరీర కణాల్లో నీటి సమతుల్యతను కాపాడటంలో, నరాల పనితీరులో, కండరాల కదలికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. చెమట ద్వారా శరీరం నీటితో పాటు ఈ ఖనిజాలను కూడా కోల్పోతుంది. కేవలం నీరు తాగడం వల్ల ద్రవాలు చేరినా, ఎలక్ట్రోలైట్ సమతుల్యత మాత్రం పునరుద్ధరించబడదు.
సంప్రదాయ పానీయాలు అయిన నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి వాటిలో సహజంగానే కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే ప్రతి సందర్భంలో ఇవి సరిపోవని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైనప్పుడు సరైన ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఎంపికలో కూడా జాగ్రత్త అవసరం. అధిక చక్కెర కలిగిన పానీయాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి సమస్యలను మరింత పెంచుతాయి. కాబట్టి తక్కువ చక్కెరతో, సరిపడా సోడియం, పొటాషియం కలిగిన పానీయాలను మాత్రమే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో హైడ్రేషన్కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం అలసటగా అనిపించడం, తరచూ తలనొప్పి రావడం, మెదడు చురుకుదనం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉంటే ముందుగా శరీరంలో నీటి లోపం ఉందేమో పరిశీలించుకోవాలి. సరైన సమయంలో తగినంత నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చని పేర్కొంటున్నారు.