న్యూఢిల్లీ : భారత్లో పెరుగుతున్న మధుమేహం కేసులు ఆందోళన రేకెత్తిస్తుండగా డయాబెటిస్ నియంత్రణకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్-19 కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం గతంలో మధుమేహులపై కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపధ్యంలో ఐసీఎంఆర్ న్యూ గైడ్లైన్స్తో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే వయోజనుల్లో మధుమేహ రోగులున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించిందని, గత మూడు దశాబ్ధాలుగా దేశంలో మధుమేహ రోగులు 150 శాతం పెరుగుతున్నారని ఐసీఎంఆర్ పేర్కొంది.
టైప్ 1 డయాబెటిస్ నియంత్రణలో జీవనశైలి నిర్వహణ కీలకమని ఐసీఎంఆర్ వెల్లడించింది. మధుమేహ వ్యాధి నియంత్రణలో ఆహార నియమాలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుందని అర్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. బీపీ, బరువు, కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుకుంటూ శరీర ఎదుగుదలకు సరైన పోషకాహారం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
మనం తీసుకునే కార్బోహైడ్రేట్లలో 70 శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలని కోరింది. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు స్ధూలకాయం తగ్గించి హృద్రోగ ముప్పును తగ్గిస్తుందని తాజా మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్ వెల్లడించింది.