న్యూఢిల్లీ : అధిక రక్తపోటుకు వాడే రిల్మెనిడిన్ మందులతో దీర్ఘాయువుతో పాటు వయసు మీరే ప్రక్రియను జాప్యం చేయవచ్చని పరిశోధకులు నిగ్గుతేల్చారు. హైపర్టెన్షన్ చికిత్సలో ప్రస్తుతం వాడుతున్న రిల్మెనిడిన్ జంతువులపై ప్రయోగించగా వచ్చిన ఫలితాలను ఏజింగ్ సెల్ జర్నల్లో ప్రచురించారు. ఈ మందును వాడే యువకులు, వయోవృద్ధుల జీవిత కాలం పెరగడంతో పాటు హెల్త్ మార్కర్స్ మెరుగవుతాయని అధ్యయనంలో గుర్తించారు.
ఈ దిశగా గతంలో పరిశీలించిన ఇతర మందులతో పోలిస్తే రిల్మెనిడిన్లో సైడ్ఎఫెక్ట్స్ అత్యంత అరుదని పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటివరకూ వృద్ధాప్య ఛాయలను నిరోధించేందుకు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారమే మెరుగైనదిగా భావిస్తున్నారు. అయితే క్యాలరీలపై నియంత్రణ మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో పాటు సైడ్ఎఫెక్ట్స్ ముప్పు ఉండటంతో దానికి దీటైన రీతిలో రిల్మెనిడిన్ ఔషధం మంచి ఫలితాలను రాబడుతోందని పరిశోధకులు గుర్తించారు.
యాంటీ ఏజింగ్కు రిల్మెనిడిన్ అద్భుత ఔషధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న క్రమంలో వయసు మీరే ప్రక్రియను జాప్యం చేసే ప్రయోజనాలు కొద్దిస్ధాయిలో అందివచ్చినా మెరుగైన ఫలితాలు ఉంటాయని అధ్యయనానికి సారధ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హాంకు చెందిన ప్రొఫెసర్ జో పెడ్రో మఘలేస్ పేర్కొన్నారు. రిల్మెనిడిన్ వాడకంతో జంతువుల జీవితకాలం పెరిగినట్టు తాము తొలిసారిగా గుర్తించామని చెప్పారు. రిల్మెనిడిన్తో ఇతర చికిత్సా విధానాలు, పద్ధతులపై తాము ఇకముందు దృష్టి సారిస్తామని తెలిపారు.