Eyesight @ Smartphone | స్మార్ట్ఫోన్ రాకతో ప్రపంచం చేతిలో ఇమిడిపోయింది. దేశవిదేశాల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెల్సుకునే వీలు చిక్కింది. దాంతో పాటే వ్యసనంగా మారి వినాశనానికి కూడా దారితీసిందని చెప్పవచ్చు. వైద్యులు, నిపుణులు ఎంతగా మొత్తుకున్నా ఈనాటి యువత స్మార్ట్ఫోన్ వాడకాన్ని తగ్గించకపోగా మరింతగా పెంచుతున్నారు. ఈ వ్యసనం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రాత్రి వేళ స్మార్ట్ఫోన్ను ఎక్కువగా వినియోగించడంతో చూపును కోల్పోయింది. రాత్రి వేళ సోషల్ మీడియాలో మునిగితేలడంతో ఆమె ఇప్పుడు కంటి చికిత్స కోసం దవాఖానల చుట్టూ తిరుగుతున్నది. న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
30 ఏండ్ల వయసున్న ఓ మహిళ బ్యూటీపార్లర్ నడిపేది. తన కుమారుడి ఆలనాపాలనా చూసేందుకు వృత్తిని మానుకున్నది. దాంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతూ ఉండేది. దాంతో స్మోర్ట్ఫోన్పై ఎక్కువ టైం గడిపేందుకు వీలు చిక్కింది. ముఖ్యంగా రాత్రి వేళ సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఉండేది. దాంతో తీవ్రమైన కాంతి ఆమె కంటిని తీవ్రంగా గాయపరిచింది. ఏకాగ్రత కూడా కోల్పోయింది. వైద్యపరీక్షలకు వెళ్లగా ఆమె స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది అంధత్వంతోపాటు కంటి సంబంధ సమస్యలకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ విజన్ సిండ్రోమ్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి.
ఆమె దినచర్యను గమనించిన వైద్యులు స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సలహా ఇచ్చారు. మందులు తీసుకుంటూ మొబైల్ ఫోన్ను దూరంగా పెట్టడం వల్ల నెల రోజుల వ్యవధిలో దృష్టి కొంత మెరుగైంది. కొన్ని రోజలపాటు ఇలాగే ఆచరించడం వల్ల దృష్టిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చునంటున్నారు డాక్టర్ సుధీర్. రాత్రివేళ ముఖ్యంగా చీకట్లో మొబైల్ఫోన్లో చాటింగ్ చేయడం, బ్రౌజింగ్ చేయడం వల్ల ఫోన్లోని బ్లూరేస్ కంటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రాత్రివేళలో మొబైల్ వాడాల్సి వస్తే కంటికి ఎదురుగా కాంతి ఉండేలా చూసుకోవాలి. అలాగే, నిద్ర పోయే సమయంలో గాడ్జెస్ పడక గదిలోకి తీసుకురాకుండా చూసుకోవాలని సెలవిస్తున్నారాయన.