ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రుగ్మత నివారించదగినది. చికిత్సకు సులభంగానే లొంగుతుంది. కాబట్టే, భారతదేశంలో ఈ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేయవచ్చు. గర్భాశయ క్యాన్సర్కు చాలావరకు హ్యూమన్ పాపిలోమా వైరస్-16, 18 రకాలే ప్రధాన కారణం. హెచ్పీవీ అనేది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. వైరస్ సోకకముందే బాలికలు, మహిళలకు హెచ్పీవీ టీకా ఇవ్వడం ద్వారా చాలావరకు సమస్యను నివారించవచ్చు. అత్యంత సమర్థంగా పనిచేసే టీకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి హెచ్పీవీ -16, 18 వైరస్ ఇన్ఫెక్షన్ను నివారిస్తాయి. 9 నుంచి 14 సంవత్సరాల బాలికలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
టీకా షెడ్యూల్ అనేది తీసుకునే వారి వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల టీకాలతో పోలిస్తే భారతీయ టీకా తక్కువ ధరలో లభిస్తుంది. మనదేశంలో గర్భాశయ క్యాన్సర్కు ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన సెరావాక్ అందుబాటులో ఉంది. తొలిదశలో, సాధారణ కణజాలం క్యాన్సర్ కణజాలంగా మారడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, అప్పుడే స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ ముందు దశలోని కణుతులను పసిగట్టవచ్చు. గర్భాశయం నుంచి తీసుకున్న కణాలపై పాప్ స్మియర్ టెస్ట్, వైరస్ టెస్ట్ చేయిస్తే క్యాన్సర్ కణాల నిర్ధారణ జరుగుతుంది.