వయసు మీద పడేకొద్దీ దాంతో పాటు వెంటాడే అనారోగ్య సమస్యలు ఎంతటి వారినైనా కుంగదీస్తాయి. ఆరోగ్యకరంగా వయసు మీరడంతో పాటు దీర్ఘాయుష్షును అందించే పెరుగును భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా వయసు పెరిగేందుకు దోహదపడే లాక్టోబసిలస్ ప్లాంటరం అనే ప్రొబయోటిక్ బ్యాక్టీరియాను మన శాస్త్రవేత్తలు రూపొందించారు. పులియబెట్టిన డైరీ పదార్ధాలతో నూతన తరం ప్రొబయోటిక్ బ్యాక్టీరియాను పరిశోధకులు గుర్తించారు.
వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెంది, నూతన ఆవిష్కరణలు జరుగుతున్నా ఆరోగ్యకరంగా దీర్ఘాయువును పెంపొందించడంలో మానవాళి ఎన్నో సమస్యలను అధిగమించాల్సి ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధుల్లో స్ధూలకాయం, అల్జీమర్స్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్లు, ఆటోఇమ్యూన్ వ్యాధులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. భారత్, చైనా వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో ఆరోగ్యకరంగా వయసుమీరే విషయంలో ఆందోళన రేకెత్తుతోంది.
వీటికి పరిష్కారంగా గౌహతికి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్టీ) ఆరోగ్యకరమైన జీవనాన్ని పెంపొందించే బ్యాక్టీరియా కోసం వేట సాగించింది. ఈ సంస్ధకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఆధారంగా లాక్టోబసిలస్ ప్లాంటరం అనే ప్రొబయోటిక్ బ్యాక్టీరియాను గుర్తించారు. వీరి అధ్యయన వివరాలు జర్నల్ యాంటీఆక్సిడెంట్ స్టేట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ బ్యాక్టీరియా మానవాళిలో దీర్ఘాయువు, ఆరోగ్యంగా వయసు మీరే ప్రక్రియకు ఉపకరిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ బ్యాక్టీరియా యాంటీఆక్సిడెంట్లు, రోగనిరోధక వ్యవస్ధ, సెరటోనిన్ సిగ్నలింగ్ పాథ్వేస్ను ప్రేరేపిస్తాయని వెల్లడించింది.