Guava | జామకాయలు అంటే చాలా మంది ఇష్టంగానే తింటారు. కొందరు జామకాయలను తింటే కొందరు జామ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. జామకాయలు కొద్దిగా దోరగా, పులుపు, తీపి రుచుల కలయికలో ఉంటాయి. జామ పండ్లు తియ్యగా ఉంటాయి. జామ కాయలను లేదా పండ్లను వేటిని తిన్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. జామకాయలను తినడం వల్ల లాభాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ రోజుకు ఎంత మోతాదులో వీటిని తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల జామ కాయలు లేదా పండ్లను రోజూ తినవచ్చు. అంతకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి. ఇక జామకాయలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అనేక పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.
జామకాయలు లేదా పండ్లను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తుంది. రోగాలు రాకుండా చూస్తుంది. జామ పండ్లను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. షుగర్ ఉన్నవారికి జామ కాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే షుగర్ లెవల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. పైగా ఈ కాయల్లో ఉండే ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. అందువల్ల జామకాయలను తరచూ తింటుంటే డయాబెటిస్ను అదుపులో ఉంచుకోవచ్చు.
జామకాయల్లో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా వీటిని తింటే చర్మం సంరక్షించబడుతుంది. సూర్యకాంతి నుంచి చర్మం సురక్షితంగా ఉంటుంది. ఆక్సీకిరణ ఒత్తిడి తగ్గిపోతుంది. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. జామకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాయలను తింటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.
జామకాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జామకాయలను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. జామ కాయల్లో తెలుపు, పింక్ రంగులో ఉండే కాయలు ఉంటాయి. అయితే పింక్ రంగులో ఉండే కాయలను తింటే విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇలా జామ కాయలు లేదా పండ్లను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.