న్యూఢిల్లీ : మధుమేహులు తమ జీవనశైలి, ఆహారం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నియంత్రణ లేకుంటే హై బ్లడ్ షుగర్ పలు అవయవాలపై ప్రభావం చూపడంతో పాటు రోజువారీ శరీరం తన పనులను చక్కబెట్టే సామర్ధ్యం కోల్పోతుంది. హై బ్లడ్ షుగర్ ప్రధానంగా కిడ్నీల పనితీరును దెబ్బతీసి డయాబెటిక్ నెఫ్రోపతికి దారితీస్తుందని దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిక్ నెఫ్రోపతితో ఇబ్బంది పడుతున్నారని మయో క్లినిక్ వెల్లడించింది. ఈ పరిస్ధితి శరీరంలో వ్యర్ధాలను తొలగించడం, శరీరం నుంచి అదనపు ఫ్లూయిడ్ను తొలగించే కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిక్ నెఫ్రోపతి దీర్ఘకాలం కొనసాగితే కిడ్నీలు ఫిల్టరింగ్ వ్యవస్ధ దెబ్బతింటుందని, ఇది ప్రాణాంతకంగా మారే కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం, మెరుగైన ఆహారం, రెగ్యులర్ చెకప్స్తో డయాబెటిక్ నెఫ్రోపతి బారినపడకుండా జాప్యం చేయవచ్చని చెప్పారు. ఊబకాయం ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారంతో బరువు తగ్గేందుకు ప్రయత్నించాలని, శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు పొగతాగే అలవాటు ఉన్నవారు తక్షణమే స్మోకింగ్ మానివేయాలని సూచిస్తున్నారు.