Heat Stress | వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ఉష్ణ ఒత్తిడి (హీట్ స్ట్రెస్)కు గురయ్యే ప్రజల సంఖ్య గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఐరోపా తీవ్ర వేడి తరంగాలతో అల్లాడుతున్న సమయంలో విడుదలైన ఈ పరిశోధన, అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది. నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం 1970ల నుంచి 2024 వరకు ప్రపంచవ్యాప్తంగా హీట్ స్ట్రెస్ పరిస్థితులను విశ్లేషించింది. అన్ని ఖండాల్లోనూ తీవ్ర, అత్యంత తీవ్ర ఉష్ణ ఒత్తిడి ఘటనలు గతంతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. హీట్ స్ట్రెస్ అంటే కేవలం గాలి ఉష్ణోగ్రత మాత్రమే కాదు. తేమ, గాలి వేగం, సూర్యరశ్మి తీవ్రత, మానవ శరీరం వేడికి ఎలా స్పందిస్తుందనే అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శరీరం అనుభవించే ఉష్ణోగ్రతను అంచనా వేస్తారు. దీనినే ఫీల్స్-లైక్ టెంపరేచర్ గా పేర్కొంటారు.
1970లలో ప్రపంచ జనాభాలో సుమారు 16 శాతం మంది కనీసం ఒకరోజైనా 46 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఫీల్స్-లైక్ ఉష్ణోగ్రతను అనుభవించేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 22 శాతానికి పెరిగింది. అంటే గతంతో పోలిస్తే అదనంగా సుమారు 100 కోట్ల మంది తీవ్ర హీట్ స్ట్రెస్కు గురవుతున్నారని అధ్యయనం పేర్కొంది. పరిశోధకులు యూనివర్సల్ థర్మల్ క్లైమేట్ ఇండెక్స్ (యూటీసీఐ) ఆధారంగా ఈ విశ్లేషణ నిర్వహించారు. ఇందులో గాలి ఉష్ణోగ్రతతోపాటు తేమ, గాలి వేగం, సౌర వికిరణం, మానవ శరీర ప్రతిస్పందన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా హీట్ స్ట్రెస్ ఘటనలు మరింత తరచూ, తీవ్రంగా, ఎక్కువసేపు కొనసాగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.
స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న ఫీల్స్-లైక్ ఉష్ణోగ్రతలు 1970లతో పోలిస్తే ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫ్రాన్స్లో సంభవించిన రెండో తీవ్రమైన వేడి తరంగం సమయంలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. గతంలో ఇలాంటి ఉష్ణ ఒత్తిడి కనిపించని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు హీట్ స్ట్రెస్ విస్తరిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, యునైటెడ్ కింగ్డమ్, స్కాండినేవియా దేశాల్లో కూడా కనీసం 38 డిగ్రీల సెల్సియస్ ఫీల్స్-లైక్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గకపోవడం మరో ఆందోళనకర అంశంగా అధ్యయనం పేర్కొంది. శరీరానికి చల్లబడేందుకు అవకాశం లేకపోవడం వల్ల ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరించారు.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ట్రాపికల్ నైట్స్ సంఖ్య కూడా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. అంటే రాత్రిపూట కూడా ఫీల్స్-లైక్ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోని రోజులు అధికమవుతున్నాయి. ఈ పరిశోధన 2024 వరకు ఉన్న గణాంకాలనే పరిశీలించినప్పటికీ, ప్రస్తుతం ఐరోపాను వణికిస్తున్న వేడి తరంగాలు ఈ ధోరణి ఇంకా కొనసాగుతోందనే సంకేతాలను ఇస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.