Heart Attack | కరోనా మహమ్మారి పుణ్యమా అని ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్లు వస్తున్నాయి. ఒకప్పుడు 40, 50 ఏండ్ల వయసు దాటిన వారిలోనే కనిపించిన కార్డియక్ అరెస్టులు ఇప్పుడు టీనేజర్లనూ వదలడం లేదు. వయసుతోనే కాదు కుటుంబ చరిత్ర కూడా అవసరం లేకుండా అందరూ గుండెపోటుకు కుదేలవుతున్నారు. అయితే ఇలా గుండెపోటు బారిన పడుతున్న వారిలో చాలామంది బాత్రూమ్లోనే కుప్పకూలుతున్న విషయం ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మంది బాత్రూమ్లోనే హార్ట్ ఎటాక్కు గురవుతున్నారని అమెరికా ఏజెన్సీ NCBI గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇలా బాత్రూమ్లోనే హార్ట్ ఎటాక్లు రావడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే..
బాత్రూమ్లో స్నానం చేసేటప్పుడు చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. స్నానం చేసేందుకు ముందుగా తలపై నుంచి నీటిని పోసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మామూలుగా మన శరీరం నిర్ణీత ఉష్ణోగ్రతతో వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే ఒంటిపై నీటిని పోసుకుంటామో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. తొలుత చల్లబడిన ప్రాంతానికి రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అదే ముందుగా తలపై నీళ్లు పోసుకుంటే శరీరంలోని అన్ని వైపుల నుంచి తల భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఆ సమయంలో రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుంది. చలికాలంలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకోవడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు స్నానం చేసేటప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.