ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో నిమ్మరసం ఉండాల్సిందే. ఏ ఇంటికెళ్లినా నిమ్మకాయ షర్బత్ తాగాల్సిందే. దోసకాయ సలాడ్ మొదలుకొని ఆమ్ పన్నా వరకు నిమ్మకాయ లేనిదే నడువదు. నిమ్మకాయలు ఆహారానికి ప్రత్యేకమైన రుచిని అందించడమే కాకుండా విటమిన్ సీ కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
విటమిన్ సీ కి కేరాఫ్ అడ్రస్ నిమ్మకాయ. అయితే, మార్కెట్లో ఒక్కసారిగా నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. కిలో రూ. 350 వరకు అమ్ముతున్నారు. ఒక్క నిమ్మకాయ రూ. 10 నుంచి రూ. 15కు విక్రయిస్తున్నారు. దీంతో చాలామంది నిమ్మకాయలు కొనలేకపోతున్నారు. విటమిన్ సీ కి ప్రత్యామ్నాయం కోసం వెదుకుతున్నారు. మరి విటమిన్ సీ ఎక్కువగా ఉండి అతి తక్కువ ధరలో, ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్న ఫలాల గురించి తెలుసుకుందామా?
1. ఉసిరి..
ఉసిరిని ఆమ్లా లేదా ఇండియన్ గూస్బెర్రీస్ అని పిలుస్తారు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. కేశాల సంరక్షణకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒక్క కాయలో 600 నుంచి 700 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సీ ఉంటుంది. ఇది మీ రోజువారీ విటమిన్ సీ అవసరాన్ని తీరుస్తుంది. బార్బడోస్ చెర్రీస్ తర్వాత ఇది పోషకాల రెండో అత్యంత సంపన్నమైన సహజ వనరు.
2. కివీ..
బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధం ఈ పండు. దానిమ్మపండు కంటే కూడా చౌకగా దొరుకుతాయి. తియ్యగా ఉంటాయి. 100 గ్రాముల పండులో 93 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అలాగే, ఇందులో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పండును తీసుకుంటే విటమిన్ సీ అందడంతోపాటు మిగతా ప్రయోజనాలూ పొందొచ్చు.
3. బొప్పాయి
బొప్పాయిని పొప్పడిపండు లేదా పపాయా అని కూడా పిలుస్తారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్న చాలా మంది మహిళలు తమ పీరియడ్స్ను క్రమబద్ధీకరించుకునేందుకు బొప్పాయిని ఆశ్రయిస్తారు. ఇందులో తక్కువ కేలరీలుంటాయి. ఫైబర్, పొటాషియం, సోడియం ఉంటాయి. 100 గ్రాముల పండులో 60.9 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సీ అందడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
4. నారింజ..
నారింజ పండునే కమలా పండు లేదా ఆరెంజ్ అని పిలుస్తారు. ఒక్కపండులో 53 మిల్లీగ్రాముల విటమిన్ సీ లభిస్తుంది. అలాగే, ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కిలో నారింజ పండ్ల ధర రూ. 50లోపే ఉంటుంది. నారింజ తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సీతోపాటు పీచుకూడా అందుతుంది.