శిశు మరణాలను నివారించాలంటే, గర్భిణిని కంటికి రెప్పలా చూసుకోవాలి. సరైన ఆహారం ఇవ్వాలి. ఆమె చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. తగిన విశ్రాంతి అవసరం. కాబోయే తల్లికి ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలి. దీనివల్ల యాభైశాతం వరకూ బరువు తక్కువ శిశు జననాలను నివారించవచ్చు. గర్భం చివరి 6-8 వారాల్లో రోజూ 20 గ్రాముల ప్రొటీన్లు, 200 క్యాలరీలు ఉన్న ఆహారం అదనంగా ఇవ్వడం వల్ల శిశువు బరువు వారానికి కనీసం 110 గ్రాములకు మించి పెరుగుతుంది.గర్భం చివరి 4-5 నెలలు ఐరన్, ఫోలిక్ యాసిడ్ బిళ్లలు ఇవ్వడం వల్ల బిడ్డ మరో 300 గ్రాములు పెరుగుతుంది. చివరి 3 నెలలు గర్భిణి మధ్యాహ్నం పూట కనీసం 2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
సమస్యలు: పిండానికి సరిపోయినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే సమస్యలు అనేకం. రక్తంలో గ్లూకోజ్, క్యాల్షియం పరిమాణం తగ్గడం, ఎర్రరక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉండటం తదితర కారణాల వల్ల పసరికలు తరచూ కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ తగ్గకుండా నివారించడానికి ఒకటే మార్గం. ప్రసవం అయిన వెంటనే శిశువుకు తల్లి చనుబాలు తాగించడం మొదలు పెట్టాలి, ఈ అలవాటును అలానే కొనసాగించాలి. దీనివల్ల రెండు మూడు రోజుల వయసు నుంచే బిడ్డ బరువు పెరగడం ప్రారంభం అవుతుంది. నెలలు నిండని శిశువులతో పోలిస్తే, నెలలు నిండి తక్కువ బరువుతో జన్మించిన శిశువులకే సమస్యలు తక్కువ. జన్మించే ప్రతి శిశువుకూ జీవించే హక్కు ఉంది. ఆ ప్రయత్నంలో మన సహకారమూ అవసరం.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు