మనం ఇంటాబయటా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటాం. ఇలాంటి సమయంలో పెండ్లయిన వారికి తమ జీవిత భాగస్వామి ఇచ్చే దన్ను ఎంతో సాంత్వన కలిగిస్తుంది. దీనికి సంబంధించి ఇలినాయిస్ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు మొత్తం 316 జంటలను పరీక్షించారు. ఈ జంటల్లో ఎక్కువమంది నడివయసుకు చేరుకున్నవారే. కొందరు మాత్రం పెండ్లి కాక పోయినా చాలాకాలం నుంచీ రిలేషన్షిప్లో ఉన్నారు. సవాళ్లు, కష్టాలు, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు.. వాటన్నిటినీ సులభంగా దాటగలరంటూ భాగస్వామి ఇచ్చే చిన్నపాటి ప్రోత్సాహం ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు.
ఆరోగ్యకరమైన మొక్కల నుంచి వచ్చే ఆహారం పర్యావరణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. రీఫైన్డ్ ధాన్యాలు, చక్కెర అధికంగా ఉన్న పానీయాలు, పండ్లరసాలు, ఆలు గడ్డలు, మిఠాయిలు లాంటివి అనారోగ్యకరమైన శాకాహార ఉత్పత్తుల కిందికి వస్తాయని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, బ్రిగ్హామ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు చెబుతున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, సిరి ధాన్యాలు, చిక్కుడు జాతి గింజలు, వంట నూనెలు, టీ, కాఫీ.. తదితరాలు ఆరోగ్యకరమైన శాకాహార ఉత్పత్తుల కిందికి వస్తాయని తెలిపారు. అనారోగ్యకరమైన మొక్కల ఆధారిత ఉత్పత్తులు వినియోగించుకున్న వారితో పోలిస్తే.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారికి గుండె వ్యాధుల ముప్పు తక్కువేనట. వీరు వాడిన ఆహార పదార్థాలు తయారు చేయడానికి.. అంటే ఉపయోగించుకున్న పంటపొలం, సాగునీరు కూడా తక్కువే.
ఆహారానికి ఉప్పు రుచిని జోడిస్తుంది. ఈ కారణంగానే చాలామంది అధికంగా ఉప్పు గుప్పించిన బ్రెడ్, మసాలా పల్లీ, సూప్స్, ఇన్స్టంట్ నూడుల్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కోసం ఎగబడతారు. అయితే ఉప్పు శరీరంలో భారీగా పేరుకుపోతే గుండె కవాటాలు, మూత్రపిండాలకు ముప్పు ఖాయమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉప్పు మితిమీరి తీసుకుంటే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ విడుదల ఎక్కువ అవుతుందట. ఇది మెదడు మీద కూడా ఒత్తిడి పెంచుతుందని స్కాట్లాండ్లోని ఎడింబరో విశ్వవిద్యాలయ పరిశోధకులు సిద్ధాంతీకరించారు. ‘మనం ఏం తింటామో అదే మనం. ఆహారంలోని ఉప్పు మన మెదడు ఆరోగ్యానికి ఏ విధంగా ముప్పుగా పరిణమిస్తుందో అర్థం చేసుకోవాలి’ అని సలహా ఇస్తున్నారు ఈ అధ్యయనం ప్రధాన రచయిత మాథ్యూ బెయిలీ. కాబట్టి ఉప్పు తగ్గించండి.. ముప్పు అధిగమించండి.