మన పెద్దలకు సత్తుపిండి ప్రయోజనాలు బాగా తెలుసు. అందుకే వాళ్లు తరచుగా సత్తుపిండిని ఆహారంగా తీసుకునేవాళ్లు. ఇప్పటికీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల్లో గ్రామీణుల ఆహారంలో సత్తుపిండి ఓ భాగమే. పేదవాళ్ల ప్రొటీన్ల భాండాగారంగా భావించే సత్తుపిండి ప్రయోజనాలను ఇప్పటితరం అంతగా పట్టించుకోవడం లేదు. వీర శివాజీ మెచ్చిన ఈ సహజమైన ప్రొటీన్ పొడి అచ్చంగా భారతీయ ఆహారమే.
సత్తుపిండి శరీరానికి వెంటనే శక్తిని ప్రసాదిస్తుంది. 100 గ్రాముల సత్తుపిండిలో ప్రొటీన్లు 25 నుంచి 30 గ్రాముల వరకు ఉంటాయి. అలా శాకాహారులకు నాణ్యమైన ప్రొటీన్లను ప్రసాదిస్తుంది. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. ఇది మన కడుపును శుద్ధిచేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్న వారికి సత్తుపిండి మంచి ఆహారపదార్థం.
సత్తుపిండిలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా పెరుగుతాయి. అలా ఇది డయాబెటిస్ ఉన్నవాళ్లకూ మంచిదే. సోడియం తక్కువ ఉండటంతో అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఆరగించవచ్చు. క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఎ, సి విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి. 25 గ్రాముల సత్తుపిండిలో 100 క్యాలరీలు ఉన్నప్పటికీ, దీని ప్రయోజనాలతో పోలిస్తే క్యాలరీల సమస్య పెద్దది కాదు. కండరాలకు శక్తినిస్తుంది కాబట్టి, పెరిగే పిల్లలకూ సత్తుపిండి గొప్పదే.
బీహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో సత్తుపిండితో లిట్టి అనే వంటకం చేస్తారు. కూరగాయలు జోడించి పరాఠాలు, ఉప్మా చేసుకోవచ్చు. సత్తుపిండికి ఉల్లిపాయలు కలిపి పకోడీలుగా వేసుకోవచ్చు. సత్తుతో లడ్డూలు, మామిడిపండు రసంతో స్మూతీ, సత్తు కబాబ్లు కూడా చేస్తారు. ఇక సత్తుపిండికి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, శనగపిండి, నెయ్యి, చక్కెర, యాలకుల పొడి లాంటివి చేర్చి చేసే సత్తు పంజిరి రుచిగా ఉంటుంది. నీళ్లు కలిపిన సత్తుపిండి ముద్దకు చక్కెర లేదంటే ఊరగాయ కలుపుకొని ఉపాహారంగానూ ఆరగించవచ్చు. మళ్లీ మధ్యాహ్నం వరకు కడుపులో ఎలుకలు ఉరుకులాడవు.
శనగలను ఇసుకలో వేయించి, ఆ తర్వాత వాటిని జల్లెడపడతారు. వీటిని పిండిగా మారుస్తారు. సత్తుపిండి అంటే ఇదే. సత్తుపిండిని బెల్లంతో కలుపుకొని గానీ, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడితో కలుపుకొని గానీ తాగితే ఆరోగ్యానికి మంచిది. సత్తు షర్బత్ ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మరసం, పుదీనా ఆకులు కూడా జోడించుకోవచ్చు. ఇది శక్తిదాయిని.
మంచిదని చెప్పి సత్తుపిండిని ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మితంగా తినాలి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవాళ్లు సత్తుపిండి తినకూడదు. కిడ్నీల్లో రాళ్లు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక శనగలంటే అలర్జీ ఉన్నవాళ్లు, సత్తుపిండి అరిగించుకోలేని వాళ్లు కూడా సత్తుకు దూరంగా ఉంటే మంచిది.