చాలామంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను లైట్గా తీసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్ల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. జలుబు, కడుపునొప్పి, జీర్ణక్రియలాంటి సమస్యలను కామన్ అని కొట్టిపారేస్తుంటారు. ఇంటిచిట్కాలు పాటిస్తారు. అయితే, ఇలా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుంటే అవి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇసాబెల్ల అనే స్కూల్ విద్యార్థి 18 నెలలపాటు కడుపు నొప్పితో బాధపడింది. తల్లిదండ్రులు స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్తే కడుపునొప్పి తగ్గిపోయే మందులు ఇచ్చి పంపించేశారు. మందులు వాడినంతసేపు నొప్పి తగ్గిపోయేది ఆ తర్వాత మళ్లీ వచ్చేది. ఇసాబెల్లకు మంచి అథ్లెట్ అవ్వాలని కోరిక. కానీ కడుపునొప్పి వల్ల జిమ్మాస్టిక్ పోటీల్లో పాల్గొనలేకపోయింది. వేగంగా బరువు కోల్పోయింది. ఎదుగుదల లోపంతో బాధపడింది. అయినా తల్లిదండ్రులు చిన్న సమస్యగానే భావించి, పెద్దగా పట్టించుకోలేదు.
కాగా, 18నెలల తర్వాత ఇసాబెల్ల సెలియాక్ వ్యాధి (ఉదరకుహర వ్యాధి) అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇదే వ్యాధి ఇసాబెల్ల అమ్మమ్మ, అత్తమ్మకు కూడా ఉంది. అంటే ఇసాబెల్లకు ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చింది. ఈ విషయం తెలిసినా..ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆమె 18నెలలు నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు ఆమెకు సెలియాక్ వ్యాధికి డాక్టర్లు చికిత్స అందించారు. గ్లూటెన్ ఫ్రీ ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం ఇసాబెల్ల పరిస్థితి అదుపులోనే ఉంది. ఒకవేళ ఈ వ్యాధికి చికిత్స చేయకుంటే క్యాన్సర్లు, బోలు ఎముకల వ్యాధి, రక్తహీనత, వంధత్వానికి దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.