కిడ్నీ వ్యాధిగ్రస్థులకు మూత్ర విసర్జన పెద్ద సమస్య. తరచూ డయాలసిస్ అవసరం అవుతుంది. ఆ సేవలు అందిస్తున్న సంస్థగా నెఫ్రో ప్లస్ సుప్రసిద్ధం. ఈ కంపెనీకి 320 క్లినిక్లు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన నెఫ్రో ప్లస్ ప్రస్థానంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు కమల్ షా నిజ జీవిత అనుభవమూ ఓ భాగమే. ‘సిల్వర్ లైనింగ్’ కమల్ షా ఆత్మకథాత్మక రచన. అందులోని విశేషాలు..
Kamal Shah | కమల్ షా కలలు తలకిందులైన సంవత్సరం.. 1997. ఆ యువ ఇంజినీర్ అమెరికాలో చదువుకునేందుకు స్టూడెంట్ వీసా ఫార్మాలిటీస్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. అందులో హెపటైటిస్, టైఫాయిడ్, మీజిల్స్, మంప్స్, రుబెల్లా వ్యాక్సిన్ల వివరాలు కూడా నమోదు చేయాలి. కొన్ని వ్యాక్సిన్లు వేయించుకున్న తర్వాత కమల్కు చిన్నపాటి జ్వరం వచ్చింది. దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. అయితే, ఇరవై నాలుగు గంటల్లోనే తన ఆరోగ్య పరిస్థితిపై ఎందుకో అనుమానం వచ్చింది. రాత్రికి రాత్రే విషమించడం మొదలైంది. వెంటనే దవాఖానకు వెళ్లారు. పరీక్షల్లో అటిపికల్ హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ (ఏహెచ్యూఎస్) ఉందని తేలింది.
ఏహెచ్యూఎస్ ఉన్నవారికి రక్త సరఫరా వ్యవస్థలో అవరోధాలు ఉంటాయి. దీంతో కిడ్నీల వైఫల్యం, గుండె జబ్బులు లాంటి తీవ్రఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇది జన్యుపరంగా వచ్చే రుగ్మత కావడంతో కచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు. జీవితాంతం సహజీవనం చేయాల్సిందే. డాక్టర్లను సంప్రదించి తగిన మందులూ వాడాల్సిందే. అప్పటినుంచి భారతదేశంలోనే అతిపెద్ద డయాలసిస్ సేవల సంస్థ నెఫ్రో ప్లస్ స్థాపించే వరకు కమల్ జీవిత ప్రయాణం ఎంతో ధైర్యంగా, దృఢనిశ్చయంతో సాగింది. ఈ ప్రయాణాన్ని ఆయన తన తాజా పుస్తకం ‘సిల్వర్ లైనింగ్’లో పంచుకున్నారు. దీన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది.
ఇంకొకరు బాధపడొద్దని గడచిన 26 ఏండ్లుగా కమల్ షా డయాలసిస్ మీదే ఉన్నారు. అయినా, మామూలుగానే బతికేస్తున్నారు. తన సొంత అనుభవమే నెఫ్రో ప్లస్ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపనలో తెలుగువారైన విక్రమ్ వుప్పల కీలకపాత్ర పోషించారు. నెఫ్రో ప్లస్ సేవలు ఇప్పుడు మరో నాలుగు దేశాలకూ విస్తరించాయి. తొలి డయాలసిస్ సెంటర్ 2010 మార్చి నెలలో హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. ప్రస్తుతం నెఫ్రో ప్లస్కు 320 క్లినిక్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 20 వేలమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ మీద ఉన్నప్పటికీ తన అనుభవాలను కమల్ తన బ్లాగ్లో పంచుకునేవారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వారి కోరిక మేరకే ‘సిల్వర్ లైనింగ్’ రాశానంటారు. కరోనా రోజుల్లో కమల్ తన వ్యాపార వ్యవహారాలను ఇంటినుంచే చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే తన రచనకు శ్రీకారం చుట్టారు. ఆయనకు మొదటినుంచీ కూడా రాయడం అంటే ఇష్టంగానే ఉండేది. తన జీవనయానం గురించి బ్లాగ్లో చాలా సమాచారమే ఇచ్చారు. అది చదివితే ఆయన బాల్యమే కాదు, ‘నెఫ్రో ప్లస్’ ప్రస్థానమూ మనకు తెలుస్తుంది.
పుస్తక రచనకు ముందే కమల్.. తన వ్యాధి విషయంలో ఎలా స్పందించారు, సమాజంలో ఎలాంటి మార్పు ఆశించారనేది ఆసక్తికరంగా బ్లాగ్లో వెల్లడిస్తూ వచ్చారు. ఇక ‘సిల్వర్ లైనింగ్’ రాసే క్రమంలో మిగతా రచయితల్లా రోజుల తరబడి ఒక దగ్గర కూర్చుని రాయడానికి కమల్ ఇబ్బందిపడ్డారు. కాకపోతే అంతకుముందే ఆయనకు బ్లాగింగ్ అలవాటు ఉండటంతో ఆ అసౌకర్యాన్ని తేలిగ్గానే అధిగమించగలిగారు. పాత సమాచారం ముందుంచుకుని పని ప్రారంభించారు. తన జీవితంలో జరిగిన సంఘటనలు, కలిసిన వారి పేర్లు.. ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకున్నారు. పాత ఈ మెయిళ్లను తిరగేశారు. సహచరులతో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించారు. అలా తన పుస్తకాన్ని ఆసక్తికరంగా మలచారు. చాలావరకు వారాంతాల్లో రాసేవారు. రోజూ పొద్దున్నే టీ తాగి, మెడిటేషన్ చేసుకున్నాక రాతకు ఉపక్రమించేవారు.
ఈ కారణంగానే ‘సిల్వర్ లైనింగ్’ పూర్తి చేయడానికి రెండేండ్లు పట్టింది. ఎడిటింగ్ ముగించుకుని.. పూర్తిస్థాయి పుస్తకంగా రావడానికి మరో ఏడాది తీసుకుంది. పుస్తకానికి స్పందన కూడా బాగానే వచ్చింది. కమల్ సన్నిహితులే కాకుండా సాధారణ పాఠకులు కూడా ఆదరించారు. ఇప్పటికే రెండో ప్రచురణకు సన్నాహాలు మొదలయ్యాయి. ‘నెఫ్రో ప్లస్’ సేవల విస్తరణకు ఇంకో నాలుగైదు దేశాల్ని గుర్తించారు కమల్. కొత్త ప్రదేశాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కోవడం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని అంటారు. ఎన్ని పనులున్నా రాయడం మాత్రం మాననని స్థిరంగా చెబుతారు కమల్. ‘అనారోగ్యాలకు తలవంచకండి. ఆ రుగ్మతపై ధైర్యంగా పోరాడండి. అప్పుడే అది మీకు తలవంచుతుంది. మీ జీవిత లక్ష్యాలకు అడ్డు తగలకుండా పక్కకు తప్పుకొంటుంది’ అని సలహా ఇస్తారు.
ఇంకా ఆరంభమే కమల్ షా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కిడ్నీ వైఫల్యం అనేది జీవితానికి ముగింపు కాదు, ఆరంభం మాత్రమే అని ఆయన నమ్ముతారు. తాను మూత్రపిండ సమస్య ఎదుర్కొన్న కారణంగా.. నెఫ్రోప్లస్కు వచ్చే ప్రతి రోగీ నవ్వుతూ తిరిగి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జైన మహావీరుడి బోధనల్ని ఇష్టపడతారు కమల్.