కొవిడ్ సోకిన ఉద్యోగుల్లో పనితీరు సామర్థ్యం తగ్గిందా? వారు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటోంది ఓ నూతన అధ్యయనం. కొవిడ్ సోకనివారితో పోలిస్తే కొవిడ్ సోకినవారిలో జ్ఞాపకశక్తి సమస్యలున్నాయని, వారి పనితీరు మందగించిందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనాన్ని కెనడాలోని వాటర్ లూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. కొవిడ్ సోకిన, సోకని 94 మందిని పరిశోధకులు రెండు బృందాలుగా విభజించి అధ్యయనం చేశారు. కొవిడ్-19 బారినడపడ్డవాళ్లకు శారీరక హాని కాకుండా..పనిచేసేసామర్థ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనంలో తేల్చారు. కొవిడ్ -19 బారిన పడనివారితో పోలిస్తే కొవిడ్ సోకినవారు పనిచేసేటప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జేమ్స్ బెక్ పేర్కొన్నారు.
కొవిడ్తో బాధపడ్డవారి పనితీరు సామర్థ్యం చాలామేర తగ్గిపోయిందని, కొందరు ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేయాలని అనుకుంటున్నట్లు పరిశోధనలో తేలిందని బెక్ చెప్పారు. కొవిడ్తో బాధపడ్డవారు పూర్వస్థితికి రావాలంటే, పనిలో వారికి కొంత వెసులబాటు కల్పించాలని సూచించారు. పనిభారం తగ్గించడం, వారి డెడ్లైన్స్ని పొడిగించడం, సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు చేయడంలాంటివి వారిలో మళ్లీ పనిపట్ల ఉత్సాహాన్ని పెంచుతాయని బెక్ వివరించారు.