ఊపిరితిత్తులు.. మన శరీరంలో అత్యంత ముఖ్యమైనవి. అయితే నేటి జీవనశైలి మార్పులు, కాలుష్యం, ధూమపానం అలవాట్ల కారణంగా చాలామంది ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నారు. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ల తర్వాత మరణానికి లంగ్ క్యాన్సర్ మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఎకువగా ఇబ్బంది పడుతుంటారు. ఇటీవలి పరిశోధన ప్రకారం.. వ్యాధి నిర్ధారణకు ఐదు సంవత్సరాల కంటే ముందే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయగల ఒక ప్రొటీన్ సిగ్నేచర్ను శాస్త్రవేత్తలు రక్తంలో గుర్తించారు. ఇది ముందస్తు చికిత్సకు మార్గం సుగమం చేయడంతో పాటు, రోగులు బతికే అవకాశాల్ని మెరుగుపరుస్తుంది. లండన్కు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు.
శాస్త్రవేత్తలు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి యూకే బయోబ్యాంక్లోని దాదాపు 48,000 మంది రక్త నమూనాల్ని, వారి ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. ఇందులో ఉన్న రక్తంలోని 14 ప్రత్యేక రకాల ప్రొటీన్ల కలయికను వారు గుర్తించారు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారిలో సగటున 5.6 సంవత్సరాల ముందే మార్పులను చూపిస్తాయి.
కణితి నుంచి కాదు: ఈ పరిశోధనలో తేలిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ ప్రొటీన్ సంకేతాలు క్యాన్సర్ గడ్డల నుంచి రావడం లేదు. వాయు కాలుష్యం లేదా ఇతర కారణాల వల్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలంగా ఏర్పడే వాపు లేదా మంట వల్ల ఈ ప్రొటీన్లు రక్తంలో పెరుగుతాయి. ఈ వాతావరణమే నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాలను యాక్టివేట్ చేస్తుంది.
వారికి కూడా ముప్పే: ప్రస్తుతం క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు కేవలం 50-70 ఏళ్ల వయసు ఉండి, ఎకువ ధూమపానం చేసేవారికే చేస్తున్నారు. కానీ, లంగ్ క్యాన్సర్ బాధితుల్లో దాదాపు పావు వంతు మంది అస్సలు ధూమపానం చేయనివారే ఉంటున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం ఎకువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారిలో ఈ ముప్పు పెరుగుతున్నది. ఈ కొత్త బ్లడ్ టెస్ట్ సిగరెట్ తాగని వారిలో కూడా క్యాన్సర్ ముప్పును ముందే గుర్తిస్తుంది.
నివారణ సాధ్యమే: క్యాన్సర్ రాకముందే ఈ ప్రొటీన్ సంకేతాల ఆధారంగా హై-రిస్ ఉన్నవారిని గుర్తిస్తే, వారికి మంటను తగ్గించే మందులు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రాకుండా ముందే ఆపవచ్చని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు గమనించారు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవారిలో దాదాపు 80% నుంచి 85% మంది రోగులు వ్యాధి చివరి దశకు చేరిన తర్వాతే హాస్పిటల్కు వస్తున్నారు. దీనివల్ల ప్రాణాలు కాపాడటం కష్టమవుతున్నది. ఈ బ్లడ్ టెస్ట్ అందుబాటులోకి వస్తే ఐదేళ్ల ముందే స్రీనింగ్ చేసి సరైన వైద్యం అందించవచ్చు.