న్యూఢిల్లీ : మన ఆరోగ్యంలో కీలక పాత్ర షోషించే కిడ్నీలను ప్రాణాంతక వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారణాలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతాయి. కిడ్నీలు బీపీని, ఎర్ర రక్త కణాల తయారీని నియంత్రించే హార్మోన్లను ప్రొడ్యూస్ చేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, మందుల వాడకం వంటి పలు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కిడ్నీలు దెబ్బతింటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ సరిపడా నీరు తాగడం, వ్యాయామం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీ వ్యాధులను లక్షణాల ద్వారా పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన అలసట, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, కండరాల నొప్పులు, కాళ్లలో వాపు, కంటిచుట్టూ నల్లటి వలయాలు, వికారం, పొటాషియం లెవెల్స్ పెరగడం, రక్త హీనత వంటివి కిడ్నీ వ్యాధుల లక్షణాలుగా చెబుతారు.
ఇక కిడ్నీల పనితీరును మెరుగుపరుచుకునేందుకు మధుమేహం, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు, అధిక బరువును నియంత్రించాలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండటంతో పాటు వైద్యుల సలహా లేకుండా మందుల వాడకం తగదని చెబుతున్నారు.