న్యూఢిల్లీ : భారత్లో వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడంతో కొవిడ్-19, ఒమిక్రాన్ వేరియంట్లతో మరణాల రేటు తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల విషయంలో మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, యూపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపింది.
వ్యాక్సినేషన్ల కారణంగా కొవిడ్-19 మరణాలు దేశవ్యాప్తంగా తక్కువగా నమోదయ్యాయని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ అన్నారు. కొవిడ్-19 థర్డ్ వేవ్లో అధిక వ్యాక్సినేషన్ వల్లనే దేశంలో వైరస్తో తీవ్ర అనారోగ్యాల బారినపడటం, మరణాల వంటివి తక్కువగా ఉన్నాయని చెప్పారు. కరోనా కేసులు అధికంగా ప్రబలుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపుతూ పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా గురువారం 3,17,532 తాజా కేసులు వెలుగుచూడగా ఒక్కరోజులో 380 మంది మరణించారు. భారత్లో ప్రస్తుతం 72 శాతం మందికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కాగా, 15-18 వయసు వారిలో 52 శాతం మందికి టీకాలు ఇచ్చామని చెప్పారు. ఇక 15 ఏండ్ల వయసులోపు వారికి నిపుణుల సలహాల మేరకు టీకా ప్రక్రియ చేపడతామని చెప్పారు.