Diaebetes and food | మధుమేహం.. సైలెన్స్గా మనలో చేరి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక్కసారి దీని బారిన పడ్డామంటే జీవితాంతం అది మన వెంటే ఉంటుంది. దీని నివారణకు ఎలాంటి చికిత్స ఇప్పటివరకు అందుబాటులో లేదు. అయితే, ఆహార విహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా నియంత్రణలో పెట్టుకోవచ్చు. కొన్ని ఆహారాలపై నిత్యం దృష్టి సారించడం ద్వారా బ్లడ్ షుగర్ను కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయని పోషకాహార వైద్య నిపుణులు సెలవిస్తున్నారు.
ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్నవారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎంత పరిమితిలో తీసుకోవాలో తెలుసు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలంటే చక్కెర, ప్రాసెస్ట్ ఫుడ్స్ దూరం పెట్టాలి. ఆరోగ్యమైన ప్రత్యామ్నాయాలతో భోజనం ప్లేట్ను నింపేలా చూసుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం సంభవిస్తుంది. అందుకని చక్కెరను నియంత్రణలో పెట్టడానికి ఆహారాల సాయం తీసుకోవాలి. చక్కెరలు ఒకేసారి పెరగకుండా ఉండేలా దోహదపడే ఆహారాలపై దృష్టిపెట్టాలి.
చక్కెర ఇలా అందదు..
నిజానికి చక్కెర పదార్థాలు తీసుకోవడం ద్వారానే శరీరానికి చక్కెర అందదు. పప్పు, రోటి, కూరగాయలతో చేసుకుని తినే ప్రతి ఆహారాల నుంచి శరీరం చక్కెరను పొందుతుంది. గ్లూకోజ్ ఎప్పుడు, ఎలా పెరుగుతుందనే విషయాలను తెల్సుకోవడం ద్వారా కొంత వరకు నివారించుకోవచ్చు. కేవలం మందులు వాడటం వల్ల రక్తంలో చక్కెర అదుపులో ఉంటుందని భావించకూడదు. ఆహారం, జీవనశైలికి సంబంధించి నిపుణుడిని సంప్రదించి తగు సూచనలు పొందాలి. ఆహారాలను మార్చుకోవడం ద్వారా వేగంగా మార్పులను చూడొచ్చు. అప్పుడు అవసరమైన జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు.
ఇవీ తినాల్సినవి..
రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుకునేందుకు సాల్మన్ చేపలతోపాటు అవిసె గింజలు, సోయాబీన్, బీన్స్, గుడ్లు, చిక్కుళ్ళు వంటి ఒమేగా 3 కొవ్వులు ఉండే ఆహారాలను తీసుకోవాలి. బ్రౌన్ రైస్, రోల్డ్ వోట్స్, బార్లీ వంటి తృణధాన్యాలు తినాలి. పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, వాల్నట్, పిస్తా వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వారు సహజ చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు, రసాలు, తేనె మొదలైనవి తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రెటెడ్గా ఉంచుకునేందుకు రోజులో ఎక్కువ మొత్తం నీరు తాగేలా ప్లాన్ చేసుకోవాలి.
ఇవీ తినకూడనివి..
తెల్లటి మైదా పిండితో చేసిన రోటి, పాస్తా వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆలస్యంగా జీర్ణమై రక్తంలో కలిసే కొవ్వులను అసలే ముట్టుకోవద్దు. పిండి పదార్థాలైన అన్నం, ఇడ్లీ, ఉప్మా, తెల్లటి రవ్వలు, మైదా పిండి, ఉప్పుడు రవ్వలను దూరంగా పెట్టాలి. జంతు ఆహారాలు, ఫ్యాట్ డైరీ ఫుడ్స్ దూరం పెట్టాలి. హెవీ క్రీమ్, హోల్ మిల్క్, పెరుగు, పేస్ట్రీలు, మిల్క్ అండ్ వైట్ చాక్లెట్, టోఫీ, బిస్కెట్లు, కేకులు, పుడ్డింగ్లు తినకుండా చూసుకోవాలి. అలాగే, ట్రాన్స్ఫ్యాట్స్ ఉండే ఫ్రై చికెన్, నగ్గెట్స్, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.