న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సత్యేందర్ జైన్ గురువారం పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరిగినా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడటం లేదని, ఆస్పత్రిలో చేరికల సంఖ్య కూడా స్వల్పంగా ఉందని ఆయన చెప్పారు. చిన్నారుల్లో కొవిడ్ కేసులపై కలత చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
సహజంగా ప్రజల్లో రోగనిరోధక వ్యవస్ధ మెరుగవడం, టీకాల పంపిణీతో ఢిల్లీలో ఆస్పత్రుల్లో చేరికల సంఖ్య పరిమితంగా ఉందని చెప్పారు. చిన్నారుల్లో కరోన తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని పలు సీరో సర్వేల్లో వెల్లడైందని మంత్రి గుర్తుచేశారు. ఈ సర్వేల్లో పెద్దలు, చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ రేటు దాదాపు సమానంగా ఉన్నట్టు వెల్లడైందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో రోజువారీ కొవిడ్-19 కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగిన నేపధ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో బుధవారం యాక్టివ్ కేసుల సంఖ్య 4832కు పెరిగింది. ఏప్రిల్ 11న 601 కేసుల నుంచి ఈ సంఖ్య పలు రెట్లు ఎగబాకింది. అయితే ఆస్పత్రుల్లో చేరికల రేటు మాత్రం భారీగా పెరగకపోవడం ఊరట కలిగిస్తోంది. గతంలో ఢిల్లీలో 5000 యాక్టివ్ కేసులు ఉన్న సమయంలో వీరిలో 1000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందగా ప్రస్తుతం కేవలం 129 మంది కొవిడ్-19 రోగులే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.