నిద్రలోనే మరణించారన్న వార్త రోజూ ఏదో ఓ రూపంలో వింటూనే ఉంటాం. అయితే దీనికి కారణాలు మాత్రం అనేకం. అందులో ఒకటి.. స్లీప్ ఆప్నియా. దీనివల్ల మరణిస్తున్నవారి సంఖ్య ఈమధ్య కాలంలో రెండింతలు పెరిగినట్ల్లు నివేదికలు చెబుతున్నాయి. నిద్రలో శ్వాస ఆగిపోవడం వల్లే ఇలా జరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు స్లీప్ ఆప్నియా కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు తదితర సమస్యలు వస్తాయని మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇటీవలి అధ్యయనం ప్రకారం.. స్లీప్ ఆప్నియాను త్వరగా గుర్తించకుండా, గుర్తించినా చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం.. ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదమూ ఉంది. గట్టిగా గురకపెట్టడం, రాత్రిళ్లు తరచూ మూత్రానికి లేవడం, మతిమరుపు, చిరాకు, ఉదయపు తలనొప్పి, పగటి నిద్ర, నీరసం.. మొదలైనవన్నీ స్లీప్ ఆప్నియా ప్రాథమిక లక్షణాలే. నిద్రలో ఆకస్మికంగా ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఓ వారం రోజుల్లో ఎన్నిసార్లు ఇలా అనిపించిందో లెక్కగట్టి డాక్టర్లకు చెప్తే, దాన్నిబట్టి సరైన సలహాలు, సూచనలు ఇవ్వగలరు.