లండన్: కొవిడ్-19 మహమ్మారి శాంతించినా దాని ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉన్నది. గర్భధారణ సమయంలో కొవిడ్-19తో బాధపడుతున్న తల్లులకు జన్మించిన శిశువుల్లో నాడీ అభివృద్ధిలో సమస్యలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కొవిడ్ సోకిన, సోకని తల్లులకు పుట్టిన బిడ్డలను పరిశీలించినప్పుడు.. కొవిడ్తో బాధపడుతున్న తల్లులకు పుట్టిన శిశువులు తల, భుజాల కదలికలను నియంత్రించడంలో కష్టపడుతున్నట్లు తేలింది. శిశువుల్లో కదలిక, నియంత్రణపై కొవిడ్ ప్రభావం ఉందని పరిశోధకులు గుర్తించారు.
‘కొవిడ్ సోకిన తల్లులకు పుట్టిన పిల్లలందరూ న్యూరో డెవలప్మెంట్ వ్యత్యాసాలను చూపించరు. కానీ గర్భంలో కొవిడ్ సోకని వారితో పోల్చితే మాత్రం వారికి ప్రమాదం ఎక్కువ ఉందని తేలింది.’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రోసా అయేసా అరియోలా తెలిపారు. కొవిడ్ సోకిన తల్లులకు జన్మించిన పిల్లలు ప్రభావవంతంగా పట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం లాంటివాటిలో కొద్దిగా భిన్నంగా స్పందిస్తారని చెప్పారు. బుడాపెస్ట్లో జరిగిన 30వ యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ సైకియాట్రీలో ఈ విశ్లేషణను ప్రదర్శించారు.