coronavirus | చాలారోజులుగా సైలెంట్గా ఉన్న కరోనావైరస్ ఇప్పుడు మళ్లీ బుసలుకొడుతోంది. దేశంలో మరోసారి కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 628 కేసులు నమోదయ్యాయి. కొత్తగా జేఎన్.1 వేరియంట్ కేసులు కూడా నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. న్యూఇయర్, సంక్రాంతి పండుగల సీజన్లో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరో వేవ్ వస్తుందేమో అని భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు మరో బూస్టర్ డోస్ తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో ఇండియా సార్స్-కోవ్2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే ఆరోరా కీలక విషయాలు వెల్లడించారు.
ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని ఎన్కే అరోరా స్పష్టం చేశారు. 60 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. అది కూడా థర్డ్ డోస్ తీసుకోని వారు మాత్రమే ముందు జాగ్రత్తగా ఈ బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్కు సంబంధించిన ఈ సబ్ వేరియంట్ కేసులు అంత తీవ్రంగా ఏమీ లేవని తెలిపారు. ఈ వేరియంట్ సోకిన వారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావట్లేదని పేర్కొన్నారు. జేఎన్.1 వేరియంట్ కారణంగా జ్వరం, ముక్కుకారడం, దగ్గు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని తెలిపారు. ఇవి ఒక వారంలో తగ్గిపోతాయని తెలిపారు.