న్యూఢిల్లీ : మలబద్ధకంతో బాధపడేవారు మందులతో కంటే సహజ సిద్ధంగా లభించే ఆహారం ఇతర జాగ్రత్తల ద్వారా తీవ్ర అనారోగ్యాలకు గురికాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే అది జీర్ణ సంబంధ వ్యాధులకు, మొలలు వంటి అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది.
మలబద్ధకానికి పలువురు ఓవర్ ది కౌంటర్ లభించే లాక్సేటివ్స్ ను అతిగా వాడుతుంటారు. ఇవి వైద్యుల సిఫార్సు లేకుండా ఎక్కువ కాలం వాడితే ఇబ్బందులు తప్పవు. మలబద్ధకాన్ని వదిలించుకునేందుకు సహజసిద్ధమైన మార్గాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవడం, రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేలా నీటిని తగినంతగా తీసుకోవాలి. గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా శారీరక కదలికలు ఉండేలా చూసుకోవాలి.
నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం, యోగా అలవరచుకోవాలి. ప్రీబయాటిక్, ప్రొబయాటిక్ ఆహారం ఉండేలా చూసుకోవాలి. అవిసె గింజలు, రాగి, జొన్న వంటి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. వీటిలో తగినంత ప్రొటీన్ తో పాటు పుష్కలంగా పీచు పదార్ధం లభిస్తుంది. టీ, కాఫీ, శీతల పానీయాలను పూర్తిగా మానేయాలి. ఇక జామ, అరటి వంటి పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు భోజన వేళలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే మలబద్ధకం బాధించదు.