గుండె.. మానవుని శరీరంలో అత్యంత ప్రధానమైంది. పుట్టిన క్షణం నుంచీ అన్ని అవయవాలకూ నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్త్తూనేఉంటుంది. ఒక్క క్షణమైనా విరామం లేకుండా.. మనిషి చనిపోయేంత వరకూ బాధ్యతలు నిర్వర్తించే ఏకైక అవయవం ఇదే. గుండె పనితీరుపైనే మనిషి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో మనిషి జీవన శైలి కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దారి తప్పుతున్న జీవన విధానాన్ని సరిదిద్దుకోలేకపోతే గుండెకు గండమేనంటున్నారు నిపుణులు.
మారుతున్న కాలంతోపాటు మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన జీవితాల్ని సుఖమయం చేయడానికి అందుబాటులోకి వస్తున్న ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికత ప్రత్యక్షంగాను, పరోక్షంగాను గుండెకు గునపపు పోట్లు పొడుస్తున్నాయి. ఒకప్పుడు 60-70 ఏండ్లు నిండిన వారిలోనే కనిపించిన గుండె సమస్యలు నేడు పాతికేండ్ల యువతలో కూడా బయటపడుతున్నాయి. వయసు పైబడిన వారిలో హృద్రోగ సమస్యలకు ప్రత్యేకమైన కారణాలంటూ ఉంటాయి. కానీ చిన్న వయసులో ఇబ్బందిపెట్టే హృద్రోగాలకు మానవ తప్పిదాలే మూలమని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. వీలైనంత త్వరగా ఆ జాడ్యాలను వదిలించుకోవాలని సూచిస్తున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏవైనా ఇబ్బందులు వస్తే కుటుంబ సభ్యులంతా కలిసి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసేవారు. అనుభవ సంపన్నులైన పెద్దలు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఎవరికివారు ఉన్నదానితో సంతృప్తి పడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి. ఏదైనా సమస్య వచ్చిపడితే చెప్పుకొని బాధపడటానికి, ఏదైనా పరిష్కారం అడగటానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. కెరీర్లో పోటీతత్వం అధికమైంది. ఫిట్ ఆర్ క్విట్.. రెండే మార్గాలు. మనుగడ కోసం పోరాడాల్సిందే. ఒత్తిడిని భరించాల్సిందే. ఆ ప్రభావం చదువుల మీదా పడుతున్నది. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే అపసవ్య ధోరణి ఆరంభం అవుతున్నది.
ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాలకు కార్డియో వాస్క్యులర్ డిసీజ్(సీవీడీ) ప్రధాన కారణమని చెబుతారు. కానీ అన్ని సందర్భాల్లోనూ సీవీడీ వల్లే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. గుండె అనేది ఒక యంత్రం లాంటిది. అది పనిచేయడానికి వేర్వేరు విభాగాల సహకారం అవసరం. గుండెలోని నాలుగు ప్రధాన భాగాలకూ నిర్దిష్టమైన విధి విధానాలు ఉంటాయి.
1. కండరాలు
ఇవి పంపులా పనిచేస్తాయి. శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే శక్తిమంతమైన గూడ్సు బండిలా కూడా వ్యవహరిస్తాయి. ఈ కండరాలు బలహీనమైనప్పుడు గుండె విఫలం అవుతుంది.
2. కవాటాలు
గుండె గదిలో నాలుగు కవాటాలు ఉంటాయి. ఇవి తెరుచుకోవడం, మూసుకోవడం ద్వారా హృదయ స్పందన జరుగుతుంది. రక్తం ఒకే దిశలో ప్రవహించేందుకు ఈ కవాటాలు దోహదపడతాయి. తెరుచుకోవడం, మూసుకోవడం అనే ప్రక్రియ సరిగ్గా జరగకపోతే గుండె పనితీరుకు అవరోధం ఏర్పడుతుంది. ఎకో కార్డియోగ్రామ్(2డి-ఎకో), ఎంఆర్ఐ పరీక్షల ద్వారా గుండె కవాటాల పనితీరు, గుండె పంపింగ్ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు.
3.విద్యుత్ వ్యవస్థ
గుండె కండరాలలోని సన్నని క్లిష్టమైన ఫైబర్స్ ద్వారా గుండె లోలోపల విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. రక్తాన్ని పంపింగ్ చేసి.. బయటికి పంపడానికి ఈ విద్యుత్ ప్రసరణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే, ప్రసరణలో ఏర్పడే అసాధారణ పరిణామాల్ని ‘అరిత్మియా’ అంటారు. ఈసీజీ పరీక్షల ద్వారా ఈ మార్పులను గుర్తించవచ్చు.
4. రక్తప్రవాహ వ్యవస్థ
గుండె బయటి ఉపరితలంపై రక్తనాళాల సమూహం ఉంటుంది. వీటినే కరొనరీ ధమనులు అంటారు. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఈ రక్తనాళాల్లో లేదా ఇతర భాగాల్లో కొలెస్ట్రాల్ వంటివి పేరుకుని పోయినప్పుడు..రోగులు గుండెపోటుతో మరణించే అవకాశం ఉంది.
సాధారణంగా గుండెపోటుకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలని చెబుతారు. కానీ ఈ రెండు సమస్యలూ లేనివారికి కూడా గుండెపోటు వస్తున్నది. ప్రత్యేకించి, యుక్తవయసు వారిలోనూ హృద్రోగాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణాలు.. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం.
పొగ తాగడం వల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతాయి. రక్తపోటు పైపైకి లేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గి, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం తక్షణమే గడ్డకట్టిపోయి.. గుండెపోటు వచ్చే అవకాశాలు అధికం. ఇక పొగతాగని వారిలో.. ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 20 శాతం వరకూ ఉంటుంది. ఈ పరిస్థితిని పాసివ్ స్మోకింగ్ అంటారు.
నాణ్యత లేని ఆహారం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. వ్యాయామం లేకపోవడంతో మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఈ అసమ తౌల్యం గుండెపోటుకు దారితీస్తుంది. నిజానికి, కొలెస్ట్రాల్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఓ పట్టాన బయటపడవు. రక్త పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తాయి.
రోజురోజుకూ యువత ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. డీప్ ఫ్రై, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ .. ఫ్యాషన్ అయిపోయింది. దీనివల్ల బరువు పెరిగి కొలెస్ట్రాల్, షుగర్ స్థాయులు అధికం అవుతున్నాయి. అంతిమంగా గుండె సమస్యలకు దారితీస్తున్నాయి.
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు. గతంలో మహిళలు ఇంటి పనుల్ని స్వయంగా చేసుకునేవారు. కానీ ఇప్పుడు పిండి రుబ్బడానికి, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి కూడా యంత్రాలు వచ్చాయి. ఫలితంగా శారీరక శ్రమ తగ్గిపోయింది. పురుషుల విషయానికొస్తే.. ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తి. భౌతికమైన శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కంప్యూటర్లు రాజ్యమేలుతున్నాయి. గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తున్నది. కదలికలు మందగించాయి. దీనివల్ల బీపీ, మధుమేహం దాపురిస్తున్నాయి. ఈ పరిస్థితి హృద్రోగాలకు దారితీస్తున్నది.
ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారంటే.. ఊబకాయానికి చేరువ అయినట్టే. దీన్ని బీపీ, మధుమేహం తదితర రుగ్మతలకు ప్రారంభ దశగా భావించాలి. ఎవరికైనా, బరువు హఠాత్తుగా పెరిగిపోదు. క్రమంగా అధికం అవుతూ వస్తుంది. ప్రారంభంలోనే దాన్ని నియంత్రించాలి.
ధూమపానం, మద్యపానం స్ట్టేటస్ సింబల్గా మారాయి. చాలామంది డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. చిన్నవయసు గుండెపోట్లకు ఇదో కారణం. మాదక ద్రవ్యాల ప్రభావంతో గుండె రక్తనాళాలు కుంచించుకుపోతాయి. గుండెకు రక్త సరఫరా మందగించి గుండెపోటుకు దారితీస్తుంది. అంటే, మన గుండెకు మనమే శత్రువులుగా మారుతున్నాం. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు గుండె పనితీరుకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సగానికి సగం మంది.. అపసవ్య జీవన విధానం, అనారోగ్యకర ఆహారం, ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ తదితర దురలవాట్ల వల్లనే గుండె వ్యాధులకు గురవుతున్నారు. తప్పులను సరిదిద్దుకుంటే.. గుండెను భద్రంగా కాపాడుకోవచ్చు. ధర్మో రక్షతి రక్షితః – ధర్మాన్ని కాపాడితే ధర్మమూ మనల్ని కాపాడుతుంది. గుండెకూ ఈ పోలిక వర్తిస్తుంది. గుండెను మనం రక్షించుకుంటే, మనల్ని గుండె రక్షిస్తుంది.
– డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు సీఎండీ, కిమ్స్ హాస్పిటల్
– డా.భుజంగరావు చైర్మన్, కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్
…?మహేశ్వర్రావు బండారి